అర్థరాత్రి దాటాక సుప్రీం విచారణ: దేశ చరిత్రలో తొలిసారి
న్యూఢిల్లీ: ఉరిశిక్షను రద్దు చేయించడానికి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమన్ తరఫు న్యాయవాదులు చివరి నిమిషం దాకా చేసిన పోరాటం ఫలించలేదు. దేశచరిత్రలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు అర్థరాత్రి దాటిన విచారణ చేపట్టింది. యాకూబ్ మెమెన్కు బుధవారం అర్థరాత్రి దాటిన ఉరి ఖాయం చేస్తూ తీర్పు చెప్పింది.
యాకూబ్ మెమన్ ఉరి శిక్ష అమలును నిలిపి వేయాలంటూ అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు స్పందించారు. అప్పటికప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ చంద్రపంత్, అమితవ రాయ్లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేశారు.
గురువారం తెల్లవారుజామున అసాధారణమైన రీతిలో ధర్మాసనం విచారణ చేపట్టింది. గురువారం తెల్లవారు జామున 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే గురువారం తెల్లవారుజామున 3 గంటల దాకా విషయం తేలలేదు.
యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష వేయాలనే నిర్ణయాన్ని అంతకు ముందు ఇదే బెంచ్ ఖరారు చేసింది. అయితే, జైలు మాన్యువల్ ప్రకారం క్షమాభిక్ష తిరస్కరణకు, ఉరిశిక్ష అమలుకు మధ్య 7 రోజుల అంతరం ఉండాలంటూ ప్రశాంత్ భూషణ్ వాదించేందుకు సిద్ధమయ్యారు. యాకూబ్ తరఫు న్యాయవాదులూ ఇదే వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్నారు.
తెల్లవారుజామున నాలుగున్నర దాకా వాదోపవాదాలు కొనసాగాయి. డిఫెన్స్ వాదనలను ఏజీ ముకుల్ రోహత్గీ తీవ్రస్థయిలో తిప్పికొట్టారు. పదేపదే పిటిషన్లు వేస్తోందంటూ డిపెన్స్ తీరును ఓ ‘గేమ్'గా అభివర్ణించారు. ఈ కేసులో న్యాయ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేశారు. తాజా పిటిషన్ యాకూబ్ మెమన్ను కాపాడేందుకు రచించిన గేమ్ ప్లాన్ అని వాదించారు. ఈ తీరు న్యాయ ప్రక్రియకు అవరోధం కలిగించడమేనని అన్నారు.
ఇరు వైపులా వాదనలు విన్న సుప్రీం త్రిసభ్య ధర్మాసనం - యాకూబ్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో, అతడికి ఉరి ఖాయమైంది. ఉదయం 7 గంటలకు యాకూబ్ మెమన్ను ఉరి తీయనున్నారు. 90 నిమిషాల పాటు వాదోపవాదాలు సాగాయి.