నేపాల్లో చూశారుగా..! గవర్నర్లు బిల్లులు ఆపడంపై సుప్రీం ఫైర్..!
దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్లు ఆమోదించకుండా పెండింగ్ లో పెడుతున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం చెప్పుచేతల్లో ఉన్న గవర్నర్లు, రాష్ట్రపతి ఇలా బిల్లులు పెండింగ్ లో పెడుతూ పోతే ఏం జరుగుతుందో చెప్పే క్రమంలో పొరుగుదేశాలు నేపాల్, బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న ఘటనల్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
తమిళనాడు, పంజాబ్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు గతంలో అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచడం, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది ఏప్రిల్ లో రాష్ట్రపతి, గవర్నర్లు ఇలా అసాధారణంగా బిల్లులు తమ వద్ద ఉంచుకోవడం సరికాదని తెలిపింది. అంతే కాదు నిర్ణీత సమయంలో బిల్లుల్ని క్లియర్ చేసి పంపాల్సిందేనని గడువు కూడా విధించింది.

బిల్లులపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరేందుకు రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రస్తావిస్తూ ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.. దీనిపై తాము గర్వపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నేపాల్లో, గతంలో బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనల్ని ప్రస్తావిస్తూ.. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. నెల రోజులకు పైగా బిల్లులను రిజర్వ్ చేసే విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లను సమర్థించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్ని బిల్లులు ఆమోదించబడినా లేదా నిలిపివేయబడినా దేశం గత 75 సంవత్సరాలుగా పనిచేస్తోందని ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో 90 శాతం గవర్నర్ ఒక నెలలోపు క్లియర్ చేస్తారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. 1970 నుండి 2025 వరకు కేవలం 20 బిల్లులు మాత్రమే ఇలా ఆలస్యమైనట్లు తెలిపారు. దీంతో ఛీఫ్ జస్టిస్ సంతృప్తి చెందలేదు. ఈ కేసులో విచారణ కొనసాగనుంది.












Click it and Unblock the Notifications