ఏక్ దిన్ కా కలెక్టర్: జెడ్పీ హైస్కూల్ విద్యార్థినికి అపూర్వ అవకాశం: రోజువారీ సమీక్షలతో బిజీగా.. !
ముంబై: ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకునే ఓ విద్యార్థినికి అద్భుతమైన అవకాశం వరించింది. ఒకరోజంతా జిల్లాను పరిపాలించే ఛాన్స్ లభించింది. అధికారిక వాహనంలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ స్థానంలో ఆసీనులయ్యారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఫిర్యాదులు, వినతిపత్రాలను కూడా స్వీకరించారు. ఓ కలెక్టర్ చేయాల్సిన పనులు, కార్యక్రమాలను ఆమె స్వయంగా పూర్తి చేశారు.
ఆ విద్యార్థిని పేరు పూనమ్ దేశ్ముఖ్. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థిని. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనా యంత్రాంగం ఆమెకు ఈ అవకాశాన్ని కల్పించింది. స్థానిక జెడ్పీ హైస్కూల్లో అత్యుత్తమ ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా ఆమె గుర్తింపు తెచ్చుకోవడంతో బుల్దానా జిల్లా కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర.. స్వయంగా పూనమ్ దేశ్ముఖ్ పేరును ఎంపిక చేశారు.
సోమవారం బుల్దానా జిల్లా కలెక్టర్గా పూనమ్ దేశ్ముఖ్ పనిచేశారు. కలెక్టర్ వినియోగించే కారులో ఆమె తాను చదువుకుంటున్న హైస్కూల్ నుంచి కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. రోజువారీ కార్యక్రమాలను సమీక్షించారు. కొందరు స్థానికుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర.. డిప్యూటీ కలెక్టర్ ఆమె వెంటే ఉన్నారు. ప్రజలకు సేవలందించే విభాగాల్లో విద్యార్థినులను ఆకర్షితులను చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ సుమన్ రావత్ తెలిపారు.
Recommended Video
అఖిల భారత సర్వీసుల వైపు యువత మొగ్గు చూపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ కాలానికి చెందిన యువత.. అత్యుత్తమంగా ఆలోచనలు చేస్తోందని, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని అన్నారు. అలాంటి వారు అఖిల భారత సర్వీసుల వైపు మొగ్గు చూపడం వల్ల పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బాలికలు, విద్యార్థినుల్లో స్ఫూర్తినింపడానికి ఏటేటా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.