డేంజర్ బెల్స్ : "ఉత్తర భారతానికి భారీ భూకంప హెచ్చరిక "
న్యూఢిల్లీ : ఉత్తరభారతంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.. భూగర్భంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాల వల్ల ఉత్తరభారతానికి భారీ భూకంప ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భూగర్బ పొరల్లో టెక్టోనిక్ గా పరిగణించే ప్లేట్ ల మధ్య చోటు చేసుకుంటున్న వ్యత్యాసాల వల్ల భారీ భూకంప సూచనలు ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
అయితే భూకంపాలు ఎప్పుడు సంభవించవచ్చు అనే దానిపై స్పష్టత ఇవ్వని శాస్త్రవేత్తలు.. రేపైనా జరగవచ్చు లేదా వచ్చే 500 ఏళ్లలో ఎప్పుడైనా చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ కు సంబంధించి గత 13 ఏళ్ల కాలంలో చోటు చేసుకున్న మార్పులను అధ్యయనం చేస్తోన్న శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడిస్తున్నారు.
శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ గా పరిగణించే 'ఇండో బర్మీస్ ఆర్క్' బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తరభారత్ గుండా వెళుతుంటుందని, అయితే ఇండియన్ బర్మీస్ ప్లేట్ కు, దీనిని ఆనుకుని ఉన్న మరో మయన్మార్ ప్లేట్ కు మధ్య ప్రతీ ఏటా 46 మి.మీ వ్యత్యాసం వస్తోందని తెలిపారు. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ పరిధిలోని 62,159 చ.కి.మీ పరిధిలో ఈ భూభాగం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
జీపీఎస్ సాంకేతికతను ఉపయోగించుకుని 13 ఏళ్ల ఉపగ్రహ ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయం వెలుగు చూసిందంటున్నారు. నేచర్ జియోసైన్స్ జర్నల్ లో తమ పరిశోధనకు సంబందించిన అన్ని వివరాలను సంక్షిప్తంగా పొందుపరిచారు శాస్త్రవేత్తలు. ఇంత పెద్ద అధ్యయనం ఇదే తొలిసారి అని, ప్లేట్ మధ్య వ్యత్యాసం కారణంగా భూకంప ప్రమాదం ఖచ్చితంగా వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
భూకంప పొరల్లో చోటు చేసుకుంటున్న ఈ వ్యత్యాసాల వల్ల సంభవించే భూకంప ప్రమాదం 99 కి.మీ మేర ప్రభావం చూపించే అవకాశముందంటున్నారు. దీని ప్రభావం 14 కోట్ల మంది ప్రజలపై ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. భారత్ లోని మొత్తం 107 ఉత్తర భారత నగరాలు, పట్టణాలు దీని ప్రభావానికి గురవుతాయని శాస్త్రవేత్తల అధ్యయనం చెబుతోంది.
ఈశాన్య రాష్ట్రాల దిగువ నుంచి వెళుతోన్న ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్, భూపొరల్లో కలిగే రాపిడి వల్ల భూకంపం సంభవిస్తుందనేది శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన అంశం. భూకంప తీవ్రతకు ఉత్తరభారత నదులయిన గంగ, బ్రహ్మపుత్ర కూడా బురదమయం అయ్యే సూచనలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.