బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత: 144 సెక్షన్ అమలు..పబ్లు, మద్యం దుకాణాలు బంద్!
బెంగళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన నగరిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలను మీడియా ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. పలు చోట్ల ఆస్తుల ధ్వంసానికి దిగినట్లు సమాచారం.
ఫలితంగా బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. బెంగళూరు మహానగర పాలికె పరిధి మొత్తంలో 144 సెక్షన్ను వర్తింపజేశారు. 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ ప్రకటించారు. దీనితోపాటు- మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు బెంగళూరులో మద్యం దుకాణాలు, పబ్లపై నిషేధం విధించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలోక్ కుమార్ హెచ్చరించారు.

రేస్కోర్స్ రోడ్ ఘటనతో ఉద్రిక్తత..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమికి గుడ్బై చెప్పిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, నగేష్ బెంగళూరు రేస్కోర్స్ రోడ్లో ఉన్న నితీష్ వింబుల్డన్ పార్క్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సమాచారం తెలియగానే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే బయటికి రావాలంటూ కేకలు వేశారు. కాంగ్రెస్ నాయకుడు ఇవాన్ డిసౌజా దీనికి సారథ్యం వహించారు. అపార్ట్మెంట్ గేట్లు ఎక్కి, లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని నివారించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చెలరేగింది. గేటు ఎక్కి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారు పోలీసులను అడ్డుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రేస్కోర్స్ రోడ్కు చేరుకున్నారు. దీనితో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తోసుకున్నారు. తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా సంఘటనాస్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు..
ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిన వెంటనే యలహంక, కృష్ణరాజపురం, హెబ్బాళ, ఎంజీ రోడ్, ఇందిరా నగర్, రాజరాజేశ్వరి నగర, శివాజీ నగర, శాంకీ రోడ్, యశ్వంతపుర, మత్తికెరె, కెంగేరి వంటి ప్రాంతాల్లో ఆయా పార్టీల కార్యకర్తలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. పార్టీ జెండాలను పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. బైక్లకు పార్టీ జెండాలను తగిలించి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో బీఎంటీసీ బస్సులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications