అసహనం ఎఫెక్టేనా?: అమీర్, షారుఖ్లకు భద్రత కుదింపు
ముంబై: బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసులు భద్రతను కుదించారు. షారుఖ్ ఖాన్, అమీర్ఖాన్లతో పాటు నిర్మాత వినోద్చోప్రాలతో సహా మరో 40మందికి భద్రతను కుదించినట్లు ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు. వీరితో పాటు మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులకు పోలీస్ భద్రతను పూర్తిగా తీసేశారు.
భద్రతను పూర్తిగా తీసేసిన వారిలో వినోద్ చోప్రా, రాజ్కుమార్ హిరానీ, ఫరా ఖాన్ తదితరులు ఉన్నారు. గతేడాది దేశంలో అసహనం పెరుగుతుందని అమీర్ ఖాన్, షారుఖ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలు సంస్థలు, రాజకీయ పార్టీల నుంచి ఇరువురు నటులు తీవ్ర విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు.
ఈ నేసథ్యంలో పోలీసులు షారుఖ్, అమీర్లకు హైసెక్యూరిటీ భధ్రతను కల్పించారు. అయితే భద్రత కుదించడమనేది కొత్తేమి కాదని, నటుల వ్యక్తిగత జీవితంపై ప్రతి ఏడాది సమీక్ష చేసి భద్రతను కుదించడం లేదా పెంచడం జరుగుతుందని ముంబై పోలీసులు వెల్లడించారు.
కాగా, అమితాబ్ బచ్చన్, దిలీప్కుమార్, మంగేష్కర్లు దేశంలో ప్రముఖ వ్యక్తులైన కారణంగా వీరికి భద్రతను కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే అమీర్, షారుఖ్లకు భద్రతను కుదించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పాటు ఇప్పటివరకు 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన అమీర్ ఖాన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇన్క్రెడిబుల్ ఇండియా' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధమైంది.