ముఖం పగిలే సమాధానం: మా బలాన్ని చూశారుగా.. రాజీనామా చేయండి: ఫడ్నవీస్ కు కాంగ్రెస్ డిమాండ్
ముంబై: శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ శాసన సభ్యుల పరేడ్ తో తమ బలమేంటో, సత్తా ఏమిటో నిరూపించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలాసాహెబ్ థొరట్ అన్నారు. తమ బలాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చూసే ఉంటారని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మంది సభ్యుల సంఖ్యాబలం తమకు ఉందని ఈ పరేడ్ తో నిరూపితమైందని చెప్పారు.
శరద్, ఉద్ధవ్, సోనియాల సారథ్యమే శిరోధార్యం: ఎమ్మెల్యేల ప్రతిజ్ఞ
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 మంది సభ్యుల బలం తమకు ఉందని నిరూపించుకోవడానికి శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ లకు చెందిన శాసన సభ్యులు సోమవారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో పరేడ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్ కు 162 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
ఈ పరేడ్ ను చూసైనా బీజేపీ నాయకులు కళ్లు తెరచుకోవాలని బాలాసాహెబ్ థొరట్ అన్నారు. సంఖ్యాబలం లేనప్పటికీ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. అధికారాన్ని అందుకోవాలనే తపనతో రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపం ఏమిటో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంతో తేలి పోయిందని మండిపడ్డారు.
పదవీ కాంక్ష కోసం బీజేపీ అధిష్ఠానం ఎంతకైనా తెగిస్తుందనే విషయం ఈ ఘటనతో రుజువైందని అన్నారు. బీజేపీ నాయకుల వద్ద నిజంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు ఉంటే.. వెంటనే వారు తమ బలాన్ని నిరూపించుకోవాలని బాలాసాహెబ్ థొరట్ డిమాండ్ చేశారు. తమ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు బీజేపీ పూనుకుంటోందని, అయినప్పటికీ.. తమ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్లరని అన్నారు.
విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నాలకు బీజేపీ దిగడం ఖాయంగా కనిపిస్తోందని ఎన్సీపీ సీనియర్ నాయకుడు నవాబ్ మాలిక్ అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రయత్నాలను చేయాలనుకుంటే.. వెంటనే ఆ ఆలోచనల నుంచి బీజేపీ నాయకులు విరమించుకోవాలని సూచించారు. కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తే అభాసుపాలు కావడం ఖాయమని హెచ్చరించారు. బీజేపీ నాయకులు ఎలాంటి విచ్ఛినకర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ముఖం పగిలే సమాధానం ఇస్తామని అన్నారు.