వరుడు కావలెను, కులంతో పనిలేదు: ఎఫ్బీలో యువతి వీడియో ప్రకటన వైరల్
తిరువనంతపురం: వరుడు లేదా వధువు కావలెను అనే ప్రకటనలను సాధారణంగా దినపత్రికలలో చూస్తేనే ఉంటాం. కానీ, ఓ యువతి ఏకంగా సామాజిక మాధ్యమం ఫేస్బుక్నే మ్యాట్రిమోనియల్ సైట్గా వాడుకుంది. తనకు వరుడు కావాలంటూ కేరళకు చెందిన ఓ అమ్మాయి ఫేస్బుక్లో వీడియో ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ ప్రకటన సంచలనంగా మారింది.
కేరళలోని మళప్పురంకు చెందిన జ్యోతి కేజీ అనే యువతి.. తన వయస్సు 28ఏళ్లని, తన తల్లిదండ్రులు మరణించారని మలయాళంలో పేర్కొంది. తనకు ఒక సోదరుడు ఉన్నాడని, ఆయన ముంబైలో సీనియర్ యాడ్ డైరెక్టర్గా పని చేస్తున్నాడని తెలిపింది.
తాను బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశానని, ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని పేర్కొంది. తన ఫేస్బుక్ పోస్ట్ చూసిన వారు.. తమకు తెలిసి ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే తనకు తెలియజేయండని తెలిపింది. అంతేగాక, తాను కులం, జాతకాల గురించి పట్టించుకోనని స్పష్టం చేసింది.

చివరకు ఫేస్బుక్కు కూడా ఆమె తన విన్నపాన్ని తెలిపింది. ఫేస్బుక్లో మ్యాట్రిమోనియల్ ఫీచర్ను కూడా ప్రారంభించాలని, ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్కి విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా ఫేస్బుక్ యూజర్లు జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications