ఈ దశలో తెలంగాణపై వారు ఫెయిలవుతారు: డిఎస్
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది, పార్లమెంటుకు రానున్న దశలో తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని తెలంగాణకు చెందిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందుతుందనే విశ్వాసం ఉందని డిఎస్ అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సుముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నప్పుడు ఇంకా సమైక్యంగా ఉండాలని అనడం సరి కాదని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం మాట ఇచ్చిన పార్టీలు తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకుని ఇబ్బందులు రాకుండా అన్ని పార్టీల సీమాంధ్ర ఎంపీలు సహకరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. విడిపోయి పరస్పరం సహకరించుకుంటూ, తెలుగుజాతి మానసిక ఐక్యతకు దోహదం చేద్దామని ఆయన అన్నారు
రాగద్వేషాలకు తావు లేకుండా స్నేహపూర్వకంగా విడిపోతే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సునాసయంగా, సంతోషంగా రాగద్వేషాలకు తావు లేకుండా విడిపోయి ముందుకు సాగుదామని ఆయన సీమాంధ్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎపి భవన్ వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణవాదులకు ఆయన సంఘీభావం తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి ఆమోదం తెలిపే విషయంలో ఏ విధమైన అనుమానాలూ లేవని ఆయన అన్నారు. పార్లమెంటులో రెండు, మూడు రోజుల్లో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తమకు ఎప్పుడూ సన్నిహిత సంబంధాలే ఉన్నాయని డిఎస్ చెప్పారు సంపూర్ణ తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications