సెన్సెక్స్ 190..నిఫ్టీ 73 పాయింట్లు : బడ్జెట్ నేపథ్యంలో నష్టాలబాట పట్టిన మార్కెట్లు
ముంబై: శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేసింది. వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థికలోటు లక్ష్యాలను సడలించాలని ఆర్థిక సర్వే సూచించింది. అయినప్పటికీ శుక్రవారం రోజున మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 12000 పాయింట్ల దిగువకు పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 190.33 పాయింట్ల మేరా నష్టపోయి 40,723 .49 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. 40,671.01 పాయింట్ల నుంచి 41,154.49 మధ్య రోజంతా సెన్సెక్స్ ఊగిసలాడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదే పంథాలో కొనసాగింది. 73.70 పాయింట్లు కోల్పోయి 11,962.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో ఓఎన్జీసీ అత్యధిక నష్టాలను చవిచూసింది. 5.80 శాతం పడిపోగా పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్లు కూడా నష్టాల బాట పట్టాయి. రంగాల పరంగా చూస్తే స్టీల్ పరిశ్రమ భారీ నష్టాలు చవిచూసింది.
మరోవైపు కొటాక్ బ్యాంక్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్ర సంస్థలు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం రోజున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే పలు అంశాలను హైలైట్ చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రైవేట్ పెట్టుబడిదారులు నుంచి పెట్టుబడులు వస్తే తప్ప ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా కనిపించడం లేదనే అంశాలను కేంద్రం ప్రస్తావించినట్లు జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎకానమిస్టుగా పనిచేస్తున్న దీప్తి మేరీ మాథ్యూ చెప్పారు.
ప్రస్తుతం అందరి కళ్లూ శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైనే ఉంది. శనివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఆరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే హాంగ్కాంగ్, దక్షిణకొరియా దేశాల స్టాక్ మార్కెట్లు ప్రమాదపుటంచుల్లో ముగిశాయి. మరోవైపు జపాన్ 1శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక చైనా మార్కెట్లు శుక్రవారం రోజు పనిచేయలేదు. యూరప్లోని మార్కెట్లు నెగిటివ్ ట్రేడింగ్తో ప్రారంభమయ్యాయి.