Covid Third Wave : సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భారత్లో కరోనా థర్డ్ వేవ్...?
దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.
భారత్లో ఇప్పటికే మూడింట రెండు వంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైన విషయంపై డా.గులేరియా స్పందించారు. ఇప్పటికీ ఒక వంతు జనాభా వైరస్ రిస్క్ను ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు. యాంటీబాడీలకు సంబంధించి రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి... శరీరంలో 'X' స్థాయిలో యాంటీబాడీలు ఉంటే రీఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటారని చెప్పేందుకు ఎటువంటి అవకాశం లేదన్నారు. రెండవది... వైరస్ బారినపడి కోలుకున్నవారిలో క్రమంగా యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. అయితే వ్యాక్సినేషన్ పెరగడం మంచి పరిణామని... థర్డ్ వేవ్ మరీ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని అన్నారు.
చిన్నారులకు ఇప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో... వైరస్ రిస్క్ వారిలో ఎక్కువగా ఉంటుందన్నారు. కేసుల సంఖ్య పెరిగితే చిన్నారులపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. పెద్దవాళ్లంతా ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకుంటుండటంతో చిన్నారులకు వైరస్ సోకే రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు అన్నారు. అయితే వైరస్ బారినపడే చిన్నారుల్లో దాని తీవ్రత అంతగా ఉండకపోవచ్చునని... సెకండ్ వేవ్ సమయంలోనూ తీవ్రమైన కోవిడ్ బారినపడ్డ చిన్నారుల సంఖ్య చాలా స్వల్పమని పేర్కొన్నారు.
వైరస్ పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దశల వారీగా స్కూళ్లు పున:ప్రారంభించాలన్నారు. సగం విద్యార్థులకు ఒకరోజు,మరో సగం విద్యార్థులకు ఒకరోజు పాఠాలు బోధించేలా క్లాసులు రూపొందించాలన్నారు. సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో 41,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 12 లక్షల 57 వేలకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య సుమారు 4.19 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ మొత్తం 45 కోట్ల 9 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేశారు.