భారత్లో కరోనా వ్యాక్సిన్ వినియోగం..ఒక అడుగు దూరంలో: సీరమ్ శుభవార్త: కోవిషీల్డ్ అప్రూవ్ కోసం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన విజృంభణను యథేచ్ఛగా కొనసాగిస్తోన్న వేళ.. దాన్ని నిర్మూలించడానికి చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం దేశ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడబోతోంది. వ్యాక్సిన్ వినియోగం..ఇక ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. కరోనా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే ఫైజర్ కంపెనీ.. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి ప్రతిపాదనలను పంపించింది. ఆ వెంటనే సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా అదే బాటలో నడిచింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం
వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ డీసీజీఐకి ప్రతిపాదనలను పంపించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించింది. దానికి సంబంధించిన పూర్తి నివేదికను డీసీజీఐకి పంపించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను వినియోగంలోకి తీసుకుని రావడానికి అనుమతి కోరింది. ఇప్పటివరకు చేపట్టిన ట్రయల్స్కు సంబంధించిన ఫలితాలను ఇందులో పొందుపరిచింది. వివిధ దశల్లో నిర్వహించిన ట్రయల్స్కు సంబంధించిన పూర్తి మెడికల్ అండ్ క్లినికల్ డేటాను సీరమ్. డీజీసీఐకి అందజేసింది.
నివేదికలో కీలక విషయాలు..
దశలవారీగా చేపట్టిన ప్రయోగాలు, పేషెంట్లు, వారి వయస్సు, వ్యాక్సిన్ అనంతరం వారికి ఎదురైన ఆరోగ్య సమస్యలు.. ఇతరత్రా వివరాలన్నింటినీ ఈ నివేదికలో పేర్కొంది. ప్రాధాన్యత క్రమాన్ని కూడా వివరించింది. వ్యాక్సిన్ అందజేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. బ్రిటన్, బ్రెజిల్లల్లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా నిర్వహించిన మూడోదశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన మెడికల్ డేటాను కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ డీసీజీఐకి అందజేసింది.
ఏప్రిల్ నాటికి వంద మిలియన్ల డోసులు..
ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకుని వస్తామంటూ ఇదివరకే సీరమ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ముందడుగు వేస్తోంది. ప్రాధాన్యత క్రమంలో మొదట 70 సంవత్సరాలు దాటిన కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్ అందిస్తారు. వచ్చ ఏడాది ఏప్రిల్ నాటికి భారత్లో 100 మిలియన్ డోసుల తొలి బ్యాచ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తామని ఆయన ఇదివరకే ప్రకటించారు.
Recommended Video
ఫైజర్ తరువాత సీరమ్..
వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ఇదివరకే డీసీజీఐకి ప్రతిపాదనలను పంపించింది. ఫైజర్-బయోఎన్టెక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్ గురువారం నుంచి బ్రిటన్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బ్రిటన్ హెల్త్ రెగ్యులేటరీ కిందటి వారమే అనుమతి ఇచ్చింది. రష్యా, చైనా, బ్రిటన్.. కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన దేశాలుగా నిలిచాయి. ఫైజర్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే.. భారత్ కూడా ఆ దేశాల సరసన నిలుస్తుంది.