Omicron Virus ఎఫెక్ట్ : బూస్టర్ డోస్ ప్రయోగాలకు సీరం ఇన్ స్టిట్యూట్ రెడీ-డేటా కోరిన నిపుణుల కమిటీ
భారత్ లో ఓమిక్రాన్ వైరస్ భయాలు పెరుగుతున్నాయి. దాంతో పాటే కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను దీనిపై మరింత సమాచారం కోరింది.
భారత్ లో ఓమిక్రాన్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వాడకం తప్పనిసరి అనేందుకు ఆధారాలు సమర్పించాలని సీరం ఇన్ స్టిట్యూట్ ను నిపుణుల కమిటీ కోరింది. దీంతో ఇప్పుడు సీరం ఇన్ స్టిట్యూట్ ఇందుకు తగ్గ ఆధారాలు సమర్పించేందుకు వీలుగా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. త్వరలో ఈ ప్రయోగాలు పూర్తి చేసి నిపుణుల కమిటీకి అవసరమైన ఆధారాలను సమర్పించనుంది. వీటిని పరిశీలించిన తర్వాత బూస్టర్ డోస్ పై నిపుణుల కమిటీ తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.
అనేక దేశాలు కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఎస్ఈసీ ఇటీవల జరిగిన సమావేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్పించిన బూస్టర్ డోసుల నివేదికపై పలు ప్రశ్నలు వేసింది. భారతీయ జనాభాకు సంబంధించిన ట్రయల్ డేటాను ముందుగా సమర్పించాలని SIIని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ప్రయోగాలు చేపట్టి పూర్తి ఆధారాలతో ఈ డేటాను ఇవ్వాలని సీరం నిర్ణయించింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిపై బూస్టర్ డోస్ ఎంత మేరకు పనిచేస్తుందన్న దానిపై సీరం నివేదిక ఇవ్వనుంది.
సీరం సంస్ధ ముందుగా కరోనావైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ యొక్క ప్రిస్క్రిబ్లింగ్ ఇన్ఫర్మేషన్ సవరణల ప్రతిపాదనను కమిటీకి సమర్పించింది. యూకేలో నిర్వహించిన ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా రెండవ డోస్ తర్వాత ఆరు నెలల తర్వాత బూస్టర్ (మూడవ) డోస్ను ఇవ్వడానికి అనుమతిని కోరింది. దీంతో నిపుణుల కమిటీ దీనికి మద్దతుగా ఇతర వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. వీటిని సీరం సమర్పిస్తే అప్పుడు అనుమతిపై నిపుణుల కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది.