రూ.1500 అప్పు చెల్లించలేదని నడిరోడ్డుపై నిప్పంటించాడు
హౌరా: అప్పుగా తీసుకున్న రూ. 1500 తిరిగి చెల్లించలేదని ఏకంగా రుణ గ్రహీతకు నిప్పుపెట్టిన సంఘటం కోల్కత్తాలోని హౌరాలో చోటు చేసుకుంది. మంటల్లో కాలిపోతూ జై బిబీ రోడ్డు వీధిలో పరిగెడుతున్న బాధితుడిని చూసిన స్థానికులు దుప్పట్లతో మంటలను ఆర్పివేసి సమీపంలోని టీఎల్ జైశ్వాల్ స్టేట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
56 శాతం కాలిపోయిన శరీరంతో ప్రస్తుతం అతను చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే... హౌరాకు చెందిన సుక్కు సాహు (40) కేటరింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సురీందర్ అనే వ్యక్తి వద్ద కొన్ని రోజుల క్రితం రూ. 1500 అప్పుగా తీసుకున్నాడు.
బుధవారం రాత్రి సుక్కు వద్దకు వెళ్లిన సురీందర్ అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆగ్రహాంతో సురీందర్ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ సుక్కు ఒంటిపై పోసి నిప్పింటించాడు.

దీంతో మంటలకు తాళలేని సుక్కు వీధుల్లోకి పరుగులు పెట్టాడు. రంజాన్ పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి వీధుల్లోని చారిత్రక ప్రదేశాల్లో లైట్లను అమర్చుతున్న స్థానికులు వెంటనే స్పందించి దుప్పట్ల సాయంతో మంటలు అదుపు చేసి ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మలిపంచగోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలైన సుక్కు పరిస్థితి విషమంగా ఉందని, మరికొన్ని గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. అయితే ఈ సంఘటనకు పాల్పడి పరారీలో ఉన్న నిందితుడు సురీందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications