గుజరాత్లో ‘ఆప్’ పోల్ఫండ్: 7గురు అభ్యర్థులకు రూ.10
అహ్మదాబాద్: ఆశ్రిత పెట్టుబడికి పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తూ గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి దిగిన అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. ఏడు లోకసభ స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్ పార్టీకి ఎన్నికల పోల్ ఫండ్ ఆశ్చర్యం కలిగించేంత వచ్చింది. ఏడుగురు అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం నిర్వహించి తలో రూ. 10లు ఫండ్గా సాధించారు.
ఆప్ పార్టీ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం.. ఆనంద్ లోకసభ స్థానం నుంచి రావ్జీ పరామర్, ఛోట ఉదేపూర్ నుంచి అర్జున్ రాథ్వా, దహోడ్ నుంచి కెసి మునియా, జాంనగర్ నుంచి రాజేంద్ర ఝాలా, ఖేడా నుంచి లభు బధివాలా, మెహసనా నుంచి వందనా పటేల్, నవసరి నుంచి మెహుల్ పటేల్ తమ పార్టీ పోల్ ఫండ్గా అత్యంత తక్కువ మొత్తాన్ని(రూ.10) సాధించారు.
కాగా, మూడంకెలను సాధించిన అభ్యర్థులు: బనస్కాంత లోకసభ స్థానం నుంచి సంజయ్ రావల్ (రూ. 611), సురేంద్రనగర్ నుంచి మన్సుఖ్ ధోఖీ (రూ. 100), జోథా పటేల్ (రూ. 733) ఉన్నారు. జునాగఢ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అతుల్ షేఖ్డా అత్యధికంగా రూ. 33,321ల ఫండ్ సాధించగా, తర్వాత స్థానంలో నటలాల్ సఖాడియా రూ. (30,977) ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి 24 మంది ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తుండగా 21 మంది అభ్యర్థుల వివరాలుమాత్రమే పార్టీ వద్ద లభించాయి.
గుజరాత్ రాష్ట్రం నుంచి ఆప్ పార్టీకి వచ్చిన మొత్తం పోల్ ఫండ్ రూ. 1.31లక్షలుగా ఉంది. ఈ ఫండ్తోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టమవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కొత్తగా బరిలోకి దిగిన తాము నిధులు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని ఆనంద్ లోకసభ అభ్యర్థి రావ్జీ పరామర్ చెప్పారు. వందనా పటేల్ మాత్రం ఫండ్స్ బాగానే వస్తున్నాయని చెబుతున్నారు. కాగా, ఆప్ వెబ్సైట్లో ఆమెకు రూ. 10 మాత్రమే లభించినట్లు చూపుతోంది.