ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రదాడి: రైళ్లు టార్గెట్: లారీ డ్రైవర్ నుంచి పక్కా సమాచారం
బెంగళూరు: శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన అనంతరం- ఇక ఉగ్రవాదుల కన్ను మనదేశంపై పడిందా? ఇక్కడ నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని సొమ్ము చేసుకుని, భీకర దాడులకు కుట్ర పన్నారా? అంటే- అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నాయని తేలింది. ఏపీ, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఉగ్రవాదులు భీకర పేలుళ్లకు పాల్పడవచ్చంటూ పోలీసులకు పక్కా సమాచారం అందంది. ఈ సమాచారం ఇచ్చింది కూడా- ఓ లారీ డ్రైవర్. విధి నిర్వహణలో భాగంగా తాను దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతుంటానని, ఈ సందర్భంగా తనకు పేలుళ్ల సమాచారం తెలిసిందంటూ ఆ డ్రైవర్ ఫోన్ ద్వారా బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు.

కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్..
ఈ సమాచారం అందిన వెంటనే- కర్ణాటక పోలీస్ డైరెక్టర్ జనరల్ నీలమణి రాజు రంగంలోకి దిగారు. దాడులు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ తేలిన రాష్ట్రాల డీజీపీలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల డీజీపీలతో పాటు- రిజర్వ్ పోలీసు బలగాలు, బెంగళూరు సిటీ కమిషనర్, రైల్వే అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్, కర్ణాటక ఇంటెలిజెన్స్ విభాగం డీజీలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఓ అధికారిక సమాచారాన్ని వారికి చేరవేశారు.

అప్రమత్తం చేసిన లారీ డ్రైవర్..
బెంగళూరు-తమిళనాడు సరిహద్దుల్లోని పారిశ్రామిక పట్టణం హోసూరు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ లారీ డ్రైవర్ శుక్రవారం సాయంత్రం 5:35 నిమిషాల సమయంలోో బెంగళూరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు. వచ్చీరాని హిందీ పదాలను ప్రయోగిస్తూ, తమిళంలో మాట్లాడారని పోలీసులు తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్రల్లో ఉగ్రవాదులు దాడులు చేయొచ్చంటూ తనకు తెలిసిందని పోలీసులకు వెల్లడించారు. ప్రధానంగా- రైళ్లల్లో బాంబులు పేలవచ్చని తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కంట్రోల్ రూమ్ పోలీసులు బెంగళూరు కమిషనర్, డీజీపీలకు ఈ ఫోన్ కాల్ గురించి తెలియజేశారు. శ్రీలంక తరహాలో ప్రార్థనా స్థలాలు, పర్యాటక కేంద్రాలపై కాకుండా.. ప్రయాణ సాధనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చోటు చేసుకోవచ్చని అనుమానిస్తున్నారు. ప్రత్యేకించి- రైళ్లల్లో బాంబు పేలుళ్లు సృష్టించడం ద్వారా పెద్ద ఎత్తున మానవ హననానికి పాల్పడ వచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

రామనాథపురంలో ఉగ్రవాదులు తిష్ట..
తమిళనాడులోని రామనాథపురంలో ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు ఆ లారీ డ్రైవర్ తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారం- కనీసం 19 మంది ఉగ్రవాదులు రామనాథపురంలో ఉన్నారని వెల్లడించారు. తమిళనాడులోని తీర ప్రాంత జిల్లా రామనాథపురం. శ్రీలంక నుంచి బయలుదేరితో- నేరుగా సముద్రమార్గం ద్వారా రామనాథపురంలో ప్రవేశించడానికి వీలుంది. శ్రీలంకలో రావణ కష్టాన్ని రగిలించిన తరువాత ఉగ్రవాదులు సముద్రగమార్గం గుండా తమిళనాడుకు చేరడానికి అవకాశాలు ఉన్నాయి. కొలంబోలో ఆత్మాహూతి పేలుళ్లు చోటు చేసుకున్న వెంటనే తమిళనాడు పోలీసులు అప్రమత్తం అయ్యారు. రామనాథపురం సహా నాగపట్టణం వంటి తీర ప్రాంత జిల్లాల్లో గస్తీ పెంచారు. సముద్ర మార్గాలపై నిఘా వేశారు.












Click it and Unblock the Notifications