ఆ రకంగా మేలు చేసిన కరోనా: నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం: ఇంకాస్త ముందే: ఐఎండీ
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కట్టి పడేసిన కరోనా వైరస్.. వాతావరణానికి మాత్రం మేలు చేసింది. మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల వాతావరణం మెరుగు పడింది. కాలుష్యం తగ్గింది. వాతావరణానికి మేలు కలిగించినట్టే. నెలన్నర రోజులుగా వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలో నిర్మలంగా మారడం వల్ల నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం పెరిగింది. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Recommended Video
విజృంభిస్తున్న కరోనా.. ఆ ఒక్క ప్రాంతంలోనే 25 కేసులు.. హైదరాబాద్లో ఇదీ పరిస్థితి..
బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశలో ఈనెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తాజాగా అంచనా వేశారు. దీని ప్రభావం తీర ప్రాంత రాష్ట్రాలపై పడుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా మే 21, 22వ తేదీల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతుంటాయని, ఈ సారి మాత్రం అంచనాలకు భిన్నంగా 16వ తేదీ నాటికే తీరాన్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతు పవనాలు అండమాన్ తీరాన్ని తాకడానికి ముందే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై విస్తరించి ఉన్న ఉపరితలద్రోణి వల్ల కోస్తా, రాయలసీమ సహా ఉత్తర తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు.
ఎంఫాన్ తుఫాన్ ముప్పు లేనట్టేనని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అండమాన్కు దక్షిణదిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్గా ఆవిర్భవిస్తుందని మొదట వేసిన అంచనా తప్పింది. ఎంఫాన్గా నామకరణం చూసిన ఆ తుఫాన్ ముప్పు ఏ మాత్రం లేదని అప్పట్లోనే అధికారులు స్పష్టం చేశారు. తాజాగా ఏర్పడే అల్పపీడన ప్రభావం వల్ల పలు వర్షాలు కురుస్తాయని, అదే పరిస్థితి మున్ముందు కొనసాగుతుందని అంటున్నారు.