అజిత్ పవార్, ఇండిపెండెంట్ల మద్దతు: 170 మంది సభ్యుల సపోర్ట్ అన్న ముకుల్ రోహత్గి
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆహ్వాన లేఖను సొలిసిటర్ జనలర్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మసనానికి అందజేశారు. ఆహ్వానం మేరకు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారని పేర్కొన్నారు. గవర్నర్కు సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయం కాదని ఈ సందర్భంగా మెహతా పేర్కొన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తరఫున ముకుల్ రోహత్గి, అజిత్ పవార్ తరఫున మునిందర్ సింగ్ తమ వాదనలను వినిపిస్తున్నారు.
22వ తేదీన లేఖ
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహర్ సమర్పించిన లేఖ 22వ తేదీతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమతో 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీ పక్ష నేతగా అజిత్ పవార్ ఉన్న సంగతి తెలిసిందే. ప్లోర్ లీడర్గా తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పడంతో.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని తుషార్ మెహతా తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ రాష్ట్రపతి పాలన తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారని పేర్కొన్నారు. ఆ మరునాడు రాష్ట్రపతి పాలన తొలగించారని తెలిపారు.
స్వతంత్రులు కూడా
ఎన్సీపీ మద్దతు కలిపి, తమకు 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఇస్తారని దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కొషియారికి తెలిపారు. దీంతో గవర్నర్ స్పందించి.. రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖరాశారు. దాంతోనే రాష్ట్రపతి పాలన తొలగించి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని సొలిసిటర్ జనలర్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
శరద్ పవార్దే తప్పట..
సుప్రీంకోర్టులో బీజేపీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపిస్తున్నారు. ఫడ్నవీస్తో అజిత్ పవార్ కలిసొస్తానని చెప్పారని పేర్కొన్నారు. ఇండిపెండెంట్ల బలంతో తమ సంఖ్య 170కి చేరిందన్నారు. కానీ తర్వాత శరద్ పవార్ మాత్రమే హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారని గుర్తుచేశారు. బీజేపీ, ఎన్సీపీ, ఇండిపెండెంట్లు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. గవర్నర్ విచక్షణాధికారంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ముకుల్ రోహత్గి తెలిపారు.
బలపరీక్ష నిర్వహించాలి.. కానీ
గవర్నర్ చర్య తప్పు కాదని పేర్కొన్నారు. గవర్నర్ చర్యను తప్పుపట్టి, నిర్ణయించే అధికారం కోర్టుకు లేదన్నారు. రాష్ట్రంలో బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది.. కానీ సుప్రీంకోర్టు మాత్రం ప్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించలేదని పేర్కొన్నారు.