జైల్లో టీవి గోల: డాన్ రాజన్ వర్సెస్ మాజీ ఎంపీ, తల పట్టుకున్న అధికారులు..
నకు కూడా టీవీ కావాలని షహబుద్దీన్ అధికారులకు లేఖ కూడా రాశాడు. టీవీ లేకపోవడంతో ఒంటరిగా ఫీలవుతున్నానని, బోర్ కొడుతోందని లేఖలో పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: ఇద్దరు బడా నేరస్తులతో తీహార్ జైలు అధికారులకు తలనొప్పులు మొదలయ్యాయి. అందులో ఒకరేమో పేరు మోసిన మాఫియా డాన్ అయితే మరొకరేమో మాజీ ఎంపీ. ఈ ఇద్దరూ జైల్లో ఒకరి పట్ల ఒకరు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో జైలు అధికారులకు లేని తిప్పలు మొదలయ్యాయి.
ఇంతకీ అసలు విషయమేంటంటే!.. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, ఆర్జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల చోటారాజన్ గదిలో అధికారులు టీవీ ఏర్పాటు చేయడంతో అసలు వివాదం మొదలైంది. చోటారాజన్ గదిలో టీవి పెట్టినప్పుడు నా గదిలో ఎందుకు పెట్టరని మాజీ ఎంపీ షహబుద్దీన్ అధికారులను ప్రశ్నిస్తున్నాడు.
అంతేకాదు, తనకు కూడా టీవీ కావాలని అధికారులకు లేఖ కూడా రాశాడు. టీవీ లేకపోవడంతో ఒంటరిగా ఫీలవుతున్నానని, బోర్ కొడుతోందని లేఖలో పేర్కొన్నాడు. రాజన్ గది నుంచి వస్తున్న టీవీ సౌండ్స్ తన నిద్రకు భంగం కలిగిస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. షహబుద్దీన్ టీవి కావాలంటూ పట్టుబట్టుతుండటంతో అధికారులు తలలు పట్టుకు కూర్చున్నారు.
కాగా,షహబుద్దీన్ 45క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న షహబుద్దీన్ ను ఫిబ్రవరి 15న సివాన్ జైలు నుంచి తీహార్ జైలుకు మార్చాల్సిందిగా సుప్రీం తీర్పునిచ్చింది. దీంతో అతను తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడంతా కరుడుగట్టిన నేరస్తులే ఉంటారు కాబట్టి భద్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది.