ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ; సిట్ సమన్లు, విచారణకు డుమ్మా!!
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులోఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటూ అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ కోర్టు రెండుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించగా బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. ఇక ఈ కేసులో షారూక్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ కూడా ఇరుక్కున్నారు.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి, చీటింగ్ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చిన కిరణ్ గోసావి అరెస్ట్
ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించే యత్నం చేసిన పూజా దడ్లానీ
ఇక ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించడం కోసం షారుక్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీ ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పూజా దడ్లానీ, కేపీ గోసావి, సామ్ డిసౌజా లు ఆర్యన్ ఖాన్ ను ఈ కేసు నుండి తప్పించడం కోసం 25 కోట్ల రూపాయల డీల్ మాట్లాడారని కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో లంచం ఆరోపణలు ఎదుర్కొన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారి సమీర్ వాంఖడే పై, లంచం వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీకి ముంబై పోలీసుల సమన్లు
ఈ క్రమంలో సమీర్ వాంఖడే ను ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు నుండి తప్పించారు.
ఇక తాజాగా లంచం వ్యవహారానికి సంబంధించి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజ దడ్లానీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇదే సమయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ టీమ్ కూడా ఆమెకు సమన్లు పంపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అట్లానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి విచారణకు హాజరు కావడానికి మరికొంత సమయం కోరినట్లుగా తెలుస్తోంది.
శనివారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా డుమ్మా కొట్టిన పూజా దడ్లానీ
లోయర్ పరేల్లో పూజ దడ్లానీ, కెపి గోసవి, సామ్ డిసౌజాలను కలిసిన సిసిటివి ఆధారాలను ముంబై పోలీసుల సిట్ గుర్తించడంతో దర్యాప్తులో దడ్లానీ పేరు బయటకు వచ్చింది. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలంటూ పూజ దడ్లానీ ముంబై పోలీసులను కోరినట్లు సమాచారం. శనివారం రోజు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయగా పూజా దడ్లానీ మాత్రం విచారణకు హాజరు కాలేదు.
కొనసాగుతున్న విచారణలో, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను కస్టడీ నుంచి విడుదల చేసేందుకు గోసావి దద్లానీ నుంచి రూ. 50 లక్షలు తీసుకున్నట్లు సామ్ డిసౌజా బాంబే హైకోర్టుకు తెలిపారు. ఎన్సీబీ ఆర్యన్ఖాన్ను అరెస్టు చేసిన తర్వాత కేపీ గోసావిని మోసగాడిగా గుర్తించి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసేలా తాను ఒత్తిడి తెచ్చానని సామ్ డిసౌజా ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించడానికి లంచం డీల్ జరిగిందని స్పష్టం చేశారు.
Recommended Video
వాట్సప్ చాట్ లు మార్చటం కోసం, కాల్ రికార్డుల కోసం హ్యాకర్ తో సంప్రదింపులు
ఇక ఇదే సమయంలో అక్టోబర్ 6వ తేదీన జలగావ్ ఆలోక్ జైన్, శైలేష్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు కాల్ రికార్డు ల వివరాలను సేకరించడం కోసం వాట్సప్ చాట్ లను సవరించడం కోసం తనను సంప్రదించారని హ్యాకర్ మనీష్ భంగాలే పేర్కొన్నారు. వాట్సప్ చాట్ బ్యాకప్ ఫైలు ఆర్యన్ ఖాన్ పేరు మీద ఉందని, అందులో పూజ దడ్లానీ పేరు కూడా ఉందని ఆరోపించారు. డేటా మార్చడం కోసం ఇద్దరు వ్యక్తులు తనను కలిసి 5 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని పదివేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారని మనీష్ భంగలే ఆరోపించారు. ఇక ఈ వ్యవహారాలతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో లింకున్న, ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజ దడ్లానీకి సమన్లు జారీ చేశారు.