పంజాబ్ సీఎం అమరీందర్పై నెటిజెన్లు మండిపాటు..సిగ్గుందా-ట్రెండ్ అవుతోన్న కెప్టెన్
ఇప్పుడున్న కాలంలో వార్తలు ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఏం జరిగేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా టీవీలపైనో లేక మరుసటి రోజు వచ్చే దినపత్రిక చదివో తెలుసుకునేవాళ్లం. ఇప్పుడు ప్రపంచం సాంకేతికపరంగా దూసుకెళుతోంది. కంప్యూటర్ యుగం కావడం అందునా.. స్మార్ట్ ఫోన్లు విప్లవం ఊపందుకోవడంతో అరచేతిలోనే ప్రపంచంలోని వార్తలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. ఇక వాటిపై అభిప్రాయం తెలిపేందుకు ఎంతో సమయం పట్టడం లేదు. ఒక్కసారి సోషల్ మీడియాకు వెళ్లి జరిగిన ఘటనపై నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఆ అభిప్రాయంపై మరికొందరు ఏకాభిప్రాయం తెలపడంతో అదికాస్త ట్రెండింగ్గా మారుతోంది. అలాంటిదే ఈ రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ట్రెండ్ అవుతున్న అమరీందర్ సింగ్
ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇక వార్తా ఛానెళ్లకంటే చాలా వేగంగా వార్తలు సోషల్ మీడియా ద్వారా అందుతున్నాయి. అయితే అందులో కొన్ని వార్తలు కేవలం తప్పుడు ప్రచారంకే పరిమితం అవుతుండగా మరికొన్ని వార్తలు మాత్రం నిఖార్సయిన నిజంగానే ఉంటున్నాయి. ఇక ఒకరు ఒక వార్తపై తమ అభిప్రాయం తెలిపితే ఆ అభిప్రాయంపై మరికొందరు ఏకాభిప్రాయం తెలపడం ద్వారా ఆ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై పోస్టింగులు ట్రెండ్ అవుతున్నాయి. #shameonAmarinderSingh అనే హ్యాష్ట్యాగ్ ట్విటర్ వేదికగా ట్రెండ్ అవుతోంది. ఈ హ్యాష్ట్యాగ్కు చాలామంది నెటిజెన్లు స్పందిస్తున్నారు. అదే సమయంలో రీట్వీట్ కూడా చేస్తున్నారు. ఇంతకీ షేమ్ ఆన్ అమరీందర్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతోంది..?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు...
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా రైతులు ఆందోళన బాట పడుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటు శీతాకాల సమావేశాలను సైతం అడ్డుకోవాలని రైతులు రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ రైతు సంఘాలకు నేతృత్వం వహిస్తున్నారు రాకేష్ టికాయత్. ఇక ఈ ఆందోళనలో పాల్గొంటున్నది ఎక్కువగా ఉత్తరాది రైతులు కావడం విశేషం. అందునా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎండనక వాననక వారు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక కోవిడ్ సమయంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే వారి నిరసనలను తెలిపారు. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ రానున్న ఉత్తర్ ప్రదేశ్ మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు నేతలు పోటీ చేసే అవకాశం లేకపోలేదని పరోక్షంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ను ఇరకాటంలో పడేశాయి. ఫలితంగా shame on Amarinder Singh ట్రెండ్ అవుతోంది.
అబద్ద ప్రచారాలను ఖండించాలి
రాకేష్ టికాయత్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెటిజెన్లు భగ్గుమన్నారు. నిరసన పేరుతో రాజకీయ వేదికను రాకేష్ టికాయత్ ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శలకు దిగారు. దీని వెనక ఉన్నది కెప్టెన్ అమరీందర్ సింగ్ అని చెప్పుకొచ్చారు. అందుకే షేమ్ ఆన్ అమరీందర్ సింగ్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. పంజాబ్లో పట్టపగలే బీజేపీ కార్యకర్తలపై రైతులు దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి నిద్రపోతున్నారని పేర్కొంటూ షేమ్ ఆన్ అమరీందర్ సింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే ప్రధాని మోదీ వ్యవసాయపరంగా ఎన్నో మంచి పనులు చేశారని, ఇలా ప్రచారం జరుగుతున్న అబద్దాలను ఖండించాలని పేర్కొంటూ షేమ్ ఆన్ అమరీందర్ సింగ్ అని రాసుకొచ్చారు.
Recommended Video
రైతు నిరసనలు నిజమైన కాదని
టికాయత్ నేతృత్వంలో జరిగే రైతు ఆందోళనలు నిజమైన నిరసనలు కాదని, టికాయత్ ఎంత దూరమైనా వెళతారని మరో నెటిజెన్ చెప్పాడు. ఇక ఎన్నికల్లో పోటీచేయాలన్న తన కోరికను టికాయత్ బయటపెట్టాడని దీన్ని బట్టి చూస్తే ఈ రైతు ఉద్యమంను కాంగ్రెస్ స్పాన్సర్ చేసినట్లుగా అర్థం అవుతోందని ఆ నెటిజెన్ చెప్పుకొస్తూ షేమ్ ఆన్ అమరీందర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. వచ్చే ఏడాది పంజాబ్తో పాటు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్,గోవా, మణిపూర్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్ మరియు ఉత్తర్ ప్రదేశ్లాంటి పెద్ద రాష్ట్రాల్లో రైతులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్లో సాగు చట్టాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదల్ తెగదెంపులు చేసుకోవడంతో అక్కడ కాషాయం పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఉత్తర్ ప్రదేశ్లో యోగీ సర్కార్ పై కూడా ప్రజలు అసంతృప్తితో ఉండటం.. సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీలు పుంజుకోవడంతో అక్కడ బీజేపీకి కష్టాలు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications