వన్ మ్యాన్ షో.. టూ మెన్ ఆర్మీ.. భరించలేక బీజేపీకి గుడ్బై చెప్పిన షాట్గన్
ఢిల్లీ : షాట్గన్ శతృఘ్నసిన్హా బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజునే కమలదళాన్ని వదిలిపెట్టారు. మోడీ, అమిత్ షా నియంతృత్వ ధోరణి భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని శతృఘ్నసిన్హా స్పష్టం చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి జరుగుతున్నఅవమానాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

వన్ మ్యాన్ షో.. టూ మెన్ ఆర్మీ..
బీజేపీలో వన్మ్యాన్ షో చూడలేక, టూ మెన్ ఆర్మీతో వేగలేకే కాంగ్రెస్లో చేరినట్లు శతృఘ్నసిన్హా ప్రకటించారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంటనే ఆయన బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పత్తాలేకుండా పోయిందని, మోడీ, అమిత్ షా నియంతరల అవతారమెత్తారని సిన్హా విమర్శించారు.

రాహుల్పై ప్రశంసల జల్లు
ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుందని కాంగ్రెస్లో చేరినట్లు శతృఘ్నసిన్హా చెప్పారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి మహానేతలున్న గొప్ప పార్టీలో చేరడం సంతోషం కలిగించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్లాంటి డైనమిక్ లీడర్ నాయకత్వం భారత్కు అవసరమని అభిప్రాయపడ్డారు.

పాట్నా సాహిబ్ నుంచి పోటీ?
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పట్ల ఉన్న కృతజ్ఞతాభావాన్ని శతృఘ్నసిన్హా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గురువు, మార్గదర్శకుడైన అద్వానీని ప్రశంసించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్లో చేరిన షాట్గన్ పాట్నా సాహిబ్ నుంచి బరిలో దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ టికెట్కు హామీ లభించడంతోనే ఆయన కాంగ్రెస్ కండువా కట్టుకున్నట్లు
తెలుస్తోంది.












Click it and Unblock the Notifications