షిర్డీ సాయి భక్తులకు అలర్ట్ - రాత్రి వేళ ఆలయం మూసివేత : రెండు హారతులకు నో ఎంట్రీ..!!
అనేక ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. ప్రధానంగా ఢిల్లీతో పాటుగా మహారాష్ట్రలోనూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక, మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కారణగా ఆంక్షలు విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
అలాగే ఇండోర్లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్డోర్లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావొద్దని ఆదేశించింది. జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతో నడిపించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో...మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రఖ్యాత షిర్డీ ఆలయం పైన ఈ ఆంక్షల ప్రభావం పడింది. దేశ వ్యాప్తంగా షిర్డీ సాయి దర్శనం కోసం పలువురు భక్తులు అక్కడకు చేరుకుంటారు.

షిర్డీ సాయి ట్రస్టు కీలక నిర్ణయం
అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఆంక్షలతో దేవస్థానం బోర్డు సైతం కీలక నిర్ణయం తీసుకుంది. షిర్డీ సాయిబాబా ఆలయం రాత్రి వేళలో మూసివేస్తున్నట్టు, భక్తులకు రాత్రివేళ దర్శనం ఉండదని షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. కర్ఫ్యూ వేళలను దృష్టిలో ఉంచుకుని భక్తులను ఉదయం, రాత్రి హారతుల దర్శనానికి అనుమతించమని పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్రలో 110 ఓమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అదే విధంగా తాజాగా 1,485 కరోనా కేసులు నమోదయ్యాయి.

రాత్రి సమయంలో ఆలయం మూసివేత
ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన వారి నమూనాలు తీసుకొని జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆంక్షల విషయంలో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా..షిర్డీ దేవాలయంలోనూ నిర్ణయాలు ఉంటాయని దేవస్థానం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications