బీజేపీకి ఓ న్యాయం, వీరికో న్యాయమా?: శివసేన
ముంబై: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వీసా జారీ విషయంలో తలలు పట్టుకుంటున్న బీజేపీకి ఇప్పుడు శివ సేన షాక్ ఇచ్చింది. మీరు మీ పార్టీ నాయకులను కాపాడుకుంటున్నారని, ఇదే విషయంలో ఆరోపణలు వచ్చిన వారిని గాలికి వదిలేస్తున్నారని శివ సేన మండిపడింది.
బుధవారం శివ సేనకు చెందిన సామ్నా పత్రికలో బీజేపీని గట్టిగానే ప్రశ్నించారు. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వీసా జారీ విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహకరించారని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు.
అయితే సుష్మా స్వరాజ్, వసుంధర రాజేని బీజేపీ నాయకులు సమర్థిస్తున్నారని, అదే లలిత్ మోదీతో ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా భేటీ అయ్యారని ఆరోపణలు వస్తే ఆయనను ఎందకు సమర్థించడం లేదని ప్రశ్నించారు.
క్రికెట్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంబకోణాలలో ప్రమేయం ఉన్న లిలిత్ మోదీకి పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండగా ఉన్నారని అంటూ ఒక సిటి పోలీసు కమిషనర్ అతనిని ఏమి చెయ్యగలడని సూటిగా ప్రశ్నించారు.
పెద్దల అనుమతి లేనిదే లండన్ లో తలదాచుకున్న లలిత్ మోదీని అరెస్టు చేసి భారత్ కు తీసుకురావడం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. లలిత్ మోదీకి సహకరించిన రాజకీయ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లిలిత్ మోదీ, ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా భేటీ విషయం తనకు తెలియదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ అంటున్నారు, ఆయన మాట్లాడిన మాటలలో ఏమైనా అర్థం ఉందా అని ఆయనే చెప్పాలని శివ సేన డిమాండ్ చేసింది.