హిందూ రాజ్యం కోసం శివసేన: రాష్ట్రపతిగా మోహన్ భగవత్.. ఇదీ మరాఠీ మెలిక
వచ్చే జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలపై దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ మొదలు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వరకూ పలువ
న్యూఢిల్లీ: వచ్చే జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలపై దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ మొదలు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వరకూ పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు చర్చలోకి వచ్చాయి. తాజాగా బీజేపీ మిత్రపక్షం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యతో ఆ జాబితాలో మరో ప్రముఖుడి పేరు వచ్చి చేరింది.
హిందూ రాజ్య స్థాపన కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ను తదుపరి రాష్ట్రపతిగా చేయాలని ప్రతిపాదించారు. ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. తమ పార్టీలో మోహన్ భగవత్ అభ్యర్థిత్వంపైన చర్చ జరిగినట్లు తెలుస్తున్నదన్నారు. ప్రణబ్ వారసుడిగా భగవత్ ఎన్నికై అందుకు సరైన ప్రతిపాదన అంటూనే దీనిపై తుది నిర్ణయం మాత్రం తమ అధినేత ఉద్ధవ్ థాకరేదని సంజయ్ రౌత్ ముక్తాయింపు ఇచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో కూడా శివసేన.. బీజేపీ, దాని మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగలేదు. 2007లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రతిభా పాటిల్.. 2012లో ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి శివసేన మద్దతునిచ్చింది. మహారాష్ట్ర వాసిగా 2007లో ప్రతిభా పాటిల్ అభ్యర్థిత్వానికి బాల్ థాకరే మద్దతు ప్రకటించారు. అయితే ఆయనతో నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. 2012లోనూ బాల్ థాకరేతో నాడు స్వయంగా ప్రణబ్ ముఖర్జీ సంప్రదింపులు జరిపారు.
హిందుత్వ జాతీయవాదానికి ధృడమైన నేత భగవత్
హిందూ జాతీయతా వాదానికి ధృడమైన నేతగా ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నియామకం తర్వాత రాష్ట్రపతిగా అంతే సమర్థవంతమైన ధృడమైన హిందూత్వ జాతీయ వాది మోహన్ భగవత్ను రాష్ట్రపతిగా నియమించాలని ప్రతిపాదించారు. గత రెండు సార్లు రాష్ట్రపతి పదవి కోసం బాలా సాహెబ్ థాకరే జాతి ప్రయోజనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చల కోసం నేతలు మాత్రుశ్రీకి వచ్చే వారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్చలకు ఆహ్వానించారన్న వార్తల నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అద్వానీ నుంచి అమితాబ్ వరకు
ఇప్పటివరకు రాష్ట్రపతి పదవికి లాల్ క్రుష్ణ అద్వానీ ప్రధాన పోటీదారుగా ఉన్నారని ప్రచారం సాగింది. ఈ పదవిలో అద్వానీని నియమించడం ఆయనకు తానిచ్చే సరైన గురు దక్షిణ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నట్లు వార్తలు వచ్చాయి. మరో సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి పేరు కూడ ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్తో జోషి చర్చించారని కూడా తెలుస్తోంది. అయితే అద్వానీతోపాటు జోషి కూడా బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదం కేసులో నిందితులు.. ఆరెస్సెస్కు సన్నిహితులు. వీరిద్దరితోపాటు మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లాతోపాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరును పరిశీలించాలని బీజేపీ ఎంపీ శత్రఘ్న సిన్హా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి ఇంకా 25 వేల ఓట్లు తక్కువగా ఉన్నాయి. బిజూ జనతాదళ్, అన్నాడీఎంకే పార్టీల నుంచి మద్దతు తేలిగ్గానే పొందొచ్చని బీజేపీ భావిస్తున్నది. అయితే తమిళనాడు సీఎంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళతో ప్రమాణం చేయించడంలో గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పాత్రపై అన్నాడీఎంకే ఆగ్రహంతో ఉన్నది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి అన్నాడీఎంకే మద్దతుగా నిలుస్తుందా? అన్నదీ అనుమానమేనని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇదీ అసలు సంగతి
తదుపరి రాష్ట్రపతి పదవి కోసం అద్వానీతోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వరకు పలువురి పేర్లు చర్చలో ఉన్నా.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును శివసేన ముందుకు తేవడంలోనూ ఆ పార్టీ ముందస్తు వ్యూహంతోనే వ్యవహరిస్తున్నదని తెలుస్తున్నది. 2014 లోక్ సభ ఎన్నికల నుంచి రెండు పార్టీల మధ్య దెబ్బ తిన్న సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు.. కేంద్రంలో కీలక మంత్రి పదవులు, తదితరాల కోసం అవసరమైన బేరసారాలకే శివసేన.. రాష్ట్రపతి అభ్యర్థిగా మోహన్ భగవత్ పేరును ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తున్నది. శివసేనకు 21 మంది ఎంపీలు, 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఓట్ల విలువ 25,893. తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఓట్లు బీజేపీకి చాలా కీలకం. ప్రధాని నరేంద్రమోడీ కూడా పట్టింపులకు పోకుండా.. ఇచ్చి పుచ్చుకునే రీతిలో ఎన్డీయే మిత్రపక్షాలతో ప్రత్యేకించి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తదితర నేతలతో వచ్చేవారం చర్చలకు ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు శివసేనకు ఆహ్వానం పంపామని బీజేపీ చెప్తున్నా.. అదేమీ లేదని శివసేన వాదిస్తున్నది.
బీఎంసీ ఎన్నికలతో రెండు పార్టీల మధ్య పెరిగిన దూరం
ఇటీవల జరిగిన బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో ముఖ్యమైన మంత్రి పదవులు పొందేందుకు రాష్ట్రపతి ఎన్నికలను సావకాశంగా తీసుకోవాలని శివసేన భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా తరుచుగా తమ రెండు పార్టీల మధ్య బంధంపై పున: సమీక్షిస్తున్నామని పేర్కొనడం గమనార్హం. వచ్చే మూడు నెలలు ఇటు కేంద్రంలోనూ.. అటు మహారాష్ట్రలోని రెండు పార్టీలకు కీలకమే. ఇదిలా ఉంటే బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్లను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదిస్తే మద్దతునిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పేర్కొనడం గమనార్హం. మోహన్ భగవత్ అభ్యర్థిత్వాన్ని శివసేన ముందుకు తీసుకొచ్చినా.. బీజేపీ ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. గతేడాది అక్టోబర్లో ప్రణబ్ ముఖర్జీని ఉత్తమ రాష్ట్రపతి అని సంజయ్ రౌత్ పొగిడి అందరినీ ఆశ్చర్య పరిచారు. కాంగ్రెస్ వాది అయినా వివాదాస్పద రాష్ట్రపతిగా, సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు గల నాయకుడిగా ఆయనకు పేరున్నది.