మోడీ సూటు వేలం గోల: రాహుల్ వస్తువులు, కేజ్రీ మఫ్లర్ అంటూ శివసేన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ సూటు వేలంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలపై శివసేన విరుచుకుపడింది. ప్రధాని నరేంద్రమోడీని ఆకాశానికెత్తింది. మోడీ ధరించినందుకే ఆ సూటుకు అంత ధర వచ్చిందన్న శివసేన, రాహుల్ గాంధీ వస్తువులను వేలం వేసి చూడండి, ఎంతొస్తుందో?, మీ విలువేమిటో తెలుస్తుందంటూ ధ్వజమెత్తింది.
కాంగ్రెస్ పార్టీతో పాటు అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్లను కూడా వదిలి పెట్టలేదు. "కేజ్రీవాల్ జీ మీ మఫ్లర్ వేలం వేసి చూడండి" అంటూ తన పత్రిక సామ్నాలో శివసేన ఘాటుగా స్పందించింది.

ఇక శుక్రవారంతో ముగిసిన వేలంలో ఈ సూటు ఏకంగా రూ. 4.31 కోట్లకు అమ్ముడుబోయిన విషయం తెలిసిందే. ఓ వ్యాపారి ఈ మొత్తం చెల్లించి సూటును సొంతం చేసుకున్నారు. ఈ సొమ్మును బాలికల విద్య కోసం ఉపయోగించనున్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సుమారు 450 బహుమతులతో పాటు ఈ సూటుని కూడా వేలం వేశారు.
మొదట బుధవారం ఈ సూటుకి రూ. 51 లక్షల బిడ్ దాఖలైంది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి రూ. 1.81 కోట్లకు చేరింది. వేలం చివరి రోజైన శుక్రవారం సూటు ధర ఒక్కసారిగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఈ సూట్ను ధరించారు.












Click it and Unblock the Notifications