ప్రధాని మోదీ బాటలోనే నేను.. మా బాస్ ఉద్దవ్ థాక్రేను ఫాలో కాను : శివసేన ఎంపీ సంజయ్ రౌత్
దేశంలో ఒకవైపు కరోనా మహామ్మారి, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. అనేక మందిని మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఈ వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మాస్క్ ధరించకుండా తిరిగే వారికి ఫైన్ సహితం విధిస్తున్నాయి. కాని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అవేవి పట్టననట్టు వ్యవహారిస్తున్నారు. ప్రధాని మోదీ మాస్కు ధరించకపోవడాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నిందించారు. దేశానికి నాయకుడూన ప్రధాన మంత్రియే మాస్కు ధరించనప్పుడు నేను ఎందుకు పెట్టుకోవాలి.. నేను మోదీని ఫాలో అవుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
మోదీని ఫాలో అవుతున్నా.. మాస్క్ పెట్టుకోను..
మహారాష్ట్రలోని నాసిక్లో శివసేన నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఫేస్ మాస్కు లేకుండా ప్రసంగించారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతమౌతున్న వేళ సంజయ్ రౌత్ మాస్కు ధరించకపోవడాన్ని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన తీవ్రంగా స్పందించారు. మాస్క్ ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ప్రజలకు ఉద్బోదిస్తారు.. కానీ ఆయన మాత్రం మాస్క్ ధరించరని ఎద్దేవా చేశారు. తాను కూడా మోదీని అనుసరిస్తున్నాను కాబట్టి మాస్క్ ధరించడంలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
దేశ నాయకుడు మాస్క్ ధరించరు.. మహారాష్ట్ర సీఎం మాత్రం..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తప్పనిసరిగా మాస్క్ ధరిస్తారు. కాని, ఈ దేశానికి నాయకుడైన మోదీ మాత్రం మాస్క్ ధరించకుండా దానిని పక్కన పెడుతున్నారని సంజయ్ రౌత్ నిందించారు. అందుకే తాను కూడా ప్రధానిని అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. చివరికి ప్రజలు కూడా మాస్కులు ధరించడంలేదన్నారు. మహారాష్ట్రలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించవద్దని సంజయ్ రౌత్ కోరారు. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారు మాస్కులు తప్పని సరిగా ధరించాలని సూచించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు ఆమె భర్త సదానంద్ సూలే, ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, అసెంబ్లీ సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారని తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా, ఒమిక్రాన్ విజృంభణ
మహారాష్ట్రలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి అంతకంతకు పెరుతోంది. నిన్న ( గురువారం ) ఒక్కరోజే 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. . 22 మంది మృతి చెందారు. అటు ఒమిక్రాన్ కేసుల నమోదు కూడా పెరుతున్నాయి. ఒక్కరోజులోనే 198 ఒమిక్రాన్ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మహారాష్ట్రాలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 450కి పెరిగాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.. కరోనాను కట్టిడి చేసేందుకు న్యూఇయర్ వేడుకలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జనవరి 7 వరకు ముంబాయితో పాటు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.