రేప్ ఆరోపణలు ఇప్పుడు ఫ్యాషన్: శివసేన,డిఐజికి సపోర్ట్
ఉన్నత వర్గాలకు చెందిన వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేయడం ఇప్పుడు బాగా పెరిగిపోయిందని, ఇదొక పెద్ద ఫ్యాషన్లా మారిపోయిందని శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా'లో పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా పోలీసు విభాగంలో సేవలందిస్తున్న సునీల్ పరాస్కర్.. ఒక్క అత్యాచారం ఆరోపణతో రాత్రికి రాత్రికి విలన్ అయిపోయారని తెలిపింది. ఈ ఆరోపణలన్నీ వ్యక్తిగత పగను తీర్చుకునేందుకు ఆయుధాలుగా మారుతున్నాయని అభివర్ణించింది.
అత్యంత దారుణమైన నిర్భయ ఘటన తర్వాత అనేకమైన చట్టాలు వచ్చాయన్న శివసేన.. అవేమైనా అత్యాచారాలను తగ్గించగలిగాయా? అని ప్రశ్నించింది. నిజం బయటికి వచ్చినప్పుడే అది తెలుస్తుందని తెలిపింది. మీడియా వీటిపై అతిగా స్పందించి ఆ అధికారికి ఉన్న ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయని పేర్కొంది. ‘దేశంలోని అన్ని చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఎవరైనా ఎవరిపైనైనా అభియోగాలు చేయవచ్చు. న్యాయస్థానాలు కళ్లు తెరిచి అమాయకులను శిక్షించకుండా చూడాలి'అని పేర్కొంది.
డిఐజిపై అత్యాచార ఆరోపణలు చేసిన మోడల్పై శివసేన మండిపడింది. ఇప్పటి వరకు అన్ని సరిగ్గా జరగడంతోనే అతనిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదా అని ప్రశ్నించింది. ఎప్పుడో అత్యాచారం చేశాడని ఇప్పుడు ఆరోపణలు చేయడమేంటని ఎవరూ ప్రశ్నించరా? అని పేర్కొంది. పోలీస్ విచారణ ఈ కోణంలోనూ జరగాలని తెలిపింది. ఆ మోడల్ ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడెందుకు కేసు పెడుతోంది.. ఇంతకాలం ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందని శివసేన ప్రశ్నించింది.
‘ఆరు నెలల క్రితం జరిగిన ఘటనపై ఆ మోడల్ ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది. శక్తిమిల్స్లో జరిగిన అత్యాచార ఘటనపై బాధితురాలు గంటల వ్యవధిలోనే ఫిర్యాదు చేసింది. ఏ మహిళైనా తనపై జరిగిన ఈ దారుణాన్ని ఒక నిమిషం కూడా దాచిపెట్టదు. ఆమె వెంటనే దానిపై ఫిర్యాదు చేస్తుంది' అని శివసేన తన కథనంలో పేర్కొంది. కానీ డిఐజిపై కేసు విషయంలో అలా జరగలేదని తెలిపింది. నిజాలు త్వరలోనే బయటపడతాయని పేర్కొంది.