ఫడ్నవీస్ కోపం, ఉద్దవ్ ఆర్డర్: బిజెపికి శివసేన గుడ్బై?
ముంబై: సిధీంద్ర కులకర్ణి పైన శివ సైనికుల దాడి నేపథ్యంలో... మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య అగాధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేన ఇంక్ దాడిని బిజెపి నేతలు కూడా ఖండించారు. మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా శివసేనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివసేన తీరు సరికాదని, ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు రాష్ట్రం పరువు తీసే విధంగా ఉందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సోమవారం నాడు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ తొలిసారి శివసేన పైన బహిరంగ విమర్శలు చేశారు.
వీసాతో పాటు కార్యక్రమ నిర్వహణకు అనుమతి పొందిన ఒక విదేశీ అతిథి ఎదుట ఇలాంటి చర్య సరికాదన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉండటం సహజమేనని, ఇంక్ దాడి మాత్రం సరికాదన్నారు. శివసేన మరో రూపంలో నిరసన తెలిపి ఉండాల్సిందన్నారు.
అంతేకాదు, పాకిస్తాన్ రచయిత మహ్మద్ కసూరికి భద్రత కల్పిస్తామని చెప్పారు. పాక్ రచయిత కూడా సీఎం ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించారు. తమకు ముఖ్యమంత్రి సహకరించారని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో బిజెపి - శివసేన మధ్య అగాధం ఏర్పడవచ్చునని అంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన మంత్రులను బయటకు రావాలని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ఆదేశాలు జారీ చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంక్ దాడి, బిజెపి నేతలు సహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆగ్రహం నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చునని అంటున్నారు. ఫడ్నవీస్ నేతృత్వంలోని సర్కారులో మంత్రులుగా ఉన్న శివసేన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయవచ్చునని అంటున్నారు.
ఫడ్నవీస్ పాలన పట్ల శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఎంతమాత్రమూ సంతృప్తికరంగా లేరని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన ప్రవర్తన ఎంతోమంది కార్యకర్తలను దూరం చేసుకునేదిగా ఉందని, ఆ పార్టీతో కలసుంటే తాము నష్టపోతామని ఉద్దవ్ థాకరే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.
త్వరలో జరగనున్న కల్యాణ్ డొంబివిల్ మునిసిపల్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగాలని, బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా? లేక రెండు పార్టీలు మళ్లీ కలిసిపోతాయా అనేది చూడవలసి ఉంది.












Click it and Unblock the Notifications