ఫేస్ బుక్ లో సీఎంను తిట్టాడని.. నడిరోడ్డు మీద గుండు కొట్టించారు..
అతనొక ఆర్ఎస్ఎస్ వ్యక్తి.. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని గట్టిగా సమర్థించాడు.. అంతటితో ఆగకుండా.. చట్టాన్ని వ్యతిరేకించినవాళ్లను దూషించాడు.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఘాటు కామెంట్లు చేశాడు. దీంతో శివసేన కార్యకర్తలు అతణ్ని వెతికి పట్టుకుని మెత్తగా తన్నారు.. నడిరోడ్డుపై గుండుకొట్టించారు.. ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెంట్ లో సంచలనంగా మారింది.
సీఎంపై తీవ్రపదజాలంతో..
సీఏఏను నిరసిస్తోన్న శివసేన చీఫ్, మహరాష్ట్ర సీఎం ఉద్దేవ్ ఠాక్రే.. ఢిల్లీ జామియా యూనివర్సిటీ ఘటనను నాటి జలియన్ వాలాబాగ్ దమనకాండతో పోల్చడం తెలిసిందే. సీఎం కామెంట్లను కౌంటర్ చేస్తూ.. ముంబైలోని వాదాలా ఏరియాకు చెందిన హీరామణి తివారీ ఈనెల 20న ఫేస్ బుక్ లో తీవ్రస్థాయి పదజాలంతో కామెంట్లు పెట్టాడు.
వెతికిపట్టుకుని తన్నారు..
తివారీ కామెంట్లు అభ్యంతరకరంగా ఉండటంతో శివసేన కార్యకర్తలు.. అతని జాడకనిపెట్టిమరీ దాడి చేశారు. ఇంట్లో నుంచి లాక్కొచ్చి నడిరోడ్డు మీద తివారీకి గుండు గీయించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో ముంబైలో వైరలైంది. తనపై శివసేన కార్యకర్తలు దాడి చేశారంటూ తివారీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
ఇద్దరిపైనా చర్యలు తప్పవంటున్న పోలీసులు
అభ్యంతరకర కామెంట్లు చేసినందుకు తివారిని, అతనిపై దాడిచేసి, గుండుకొట్టించినందుకు శివసేన కార్యకర్తలపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి రెండు వర్గాలు కాంప్రమైజ్ అయ్యాయని, మళ్లీ తేడాలొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే తివారీ మాత్రం తాను కాంప్రమైజ్ కాదల్చుకోలేదని మీడియాకు చెప్పగం గమనార్హం. దాడి వల్ల తన చెవులు దెబ్బతిన్నాయని, శివసేన గుండాగిరికి ఇదొక నిదర్శనమని తివారీ ఆరోపించాడు.