బీజేపీ విఫలమైతే..మా వ్యూహం సిద్దం: ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ: సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..!
మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. గవర్నర్ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించటంతో..పార్టీలు వేగంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. గవర్నర్ ఆహ్వానం మేరకు అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోవాలని, ఇందులో ఆ పార్టీ విఫలమైతే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ ముందుకు వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం లోగా బలనిరూపణ చేసుకోవాలని తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను మహారాష్ట్ర గవర్నర్ కోరారు. మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని శివసేన స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామన..అదే సమయంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం దీర్ఘకాలం అనిశ్చితి కొనసాగడం మంచిది కాదని చెప్పుకొచ్చారు.
బీజేపీ విఫలమైతే..మేము సిద్దం..
గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించటం పైన శివసేన ఎంపీ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ సభలో బల నిరూపణలో విఫలమైతే..తాము అప్పుడు తమ వ్యూహం ఏంటో ప్రకటిస్తామని సంజయ్ రౌత్ ప్రకటించారు. ఏకైక పెద్ద పార్టీని ఆహ్వానించడం సహజమే. కానీ, మెజారిటీ ఉందనుకున్నప్పుడు ఫలితాలు వెలువడిన 24 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ఎందుకు ముందుకు రాలేదో మాకు అర్ధం కావడం లేదన్నారు.

రాజకీయాల్లో ఒప్పందాలకు తమ పార్టీ వ్యతిరేకమని, శివసేన డిక్షనరీలో డీల్ అనే పదమే లేదని బీజేపీపై ధ్వజమెత్తారు. మరోవైపు అయోధ్య తీర్పును శివసేన స్వాగతిస్తుందని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో బీజేపీని హిట్లర్తో పోల్చుతూ శివసేన విమర్శలతో విరుచుకుపడింది. గవర్నర్ వేసిన మొదటి అడుగుపై స్పష్టత వచ్చి, ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకుంటే అప్పుడు శివసేన తమ వ్యూహాన్ని ప్రకటిస్తుందని రౌత్ స్పష్టం చేసారు.
బీజేపీ తర్జన భర్జన..రంగంలోకి కాంగ్రెస్
ఒక వైపు గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వం ఏర్పాటు అంశం పైన బీజేపీ తర్జన భర్జన పడుతోంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బలం నిరూపించుకొనే అవకాశం లేదని శివసేన అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఎన్సీపీ..కాంగ్రెస్ సైతం రంగంలోకి దిగాయి. తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ కోరుతోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ బల నిరూపణ లో విఫలమైతే రెండో పెద్ద కూటమిగా కాంగ్రెస్..ఎన్సీపీలు నిలుస్తాయి.
దీంతో..తమకు అవకాశం దక్కుతందనే అంచనాలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. అయితే, శివసేన తమకు ప్రభుత్వంలో వాటా ఇవ్వకపోతే మద్దతిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తొలి అవకాశం బీజేపీకి ఇవ్వటంతో ఇప్పుడు బీజేపీ వేసే అడుగులు..ఫలితాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా..ఇప్పుడు గవర్నర్ రాజకీయ పరిణామాలను గమనిస్తూ.. ఆయన వేసే అడగులు కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications