పెళ్ళయిన రెండు రోజులకే షాకింగ్ ఘటన: నవవధువు జైలు పాలు; అసలేం జరిగిందంటే
పెళ్లి అయిన రెండు రోజులకు ఓ నవవధువు జైలు పాలైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు రోజులకే ఆ వధువు జైలుకు వెళ్ళేంత తప్పు ఏం చేసింది అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. నవవధువు ఏం చేసిందో తెలుసుకున్న వారంతా షాక్ కు గురికాగా, భర్త మాత్రం లబోదిబోమంటున్నాడు.
షాకింగ్ పని చేసిన కొత్త పెళ్లి కూతురు
ఇంతకీ ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కి చెందిన సచిన్ తివారి అనే వ్యక్తికి గత నెల 19వ తేదీన మహారాష్ట్రకు చెందిన నిఖిత అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నా అన్న సంతోషం లో ఉన్న సచిన్ తివారీకి ఆ సంతోషం ఎంతోకాలం మిగలలేదు. పెళ్లయిన మూడో రోజే నిఖిత అత్త గారి ఇల్లు వదిలి పెట్టి ఉడాయించింది.
నిఖిత ఎవరితోనో పరారైంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. పెళ్లయిన రెండు రోజులకే భర్త ఇంట్లో లేని సమయంలో అత్తమామలకు పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నిఖిత ఇంట్లోనే లక్షలు విలువైన బంగారాన్ని, నగలను తీసుకొని పరారైంది.
డబ్బు, నగలు చోరీ చేసి ఉడాయించిన నవవధువు అరెస్ట్
కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూసిన సచిన్ తివారి భార్య లేకపోవడంతో కంగుతిన్నాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు కనిపించకపోవడంతో జరిగింది అర్థం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సచిన్ తివారీకి, నిఖితకు పరిచయమున్న మధ్యవర్తులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి ద్వారా నిఖిత సమాచారాన్ని సేకరించిన పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో, ఆమె నేరుగా వెళ్ళి పోలీస్స్టేషన్లో లొంగిపోయింది. కొత్తగా పెళ్లయిన నవవధువు ను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
రెంటికీ చెడ్డ రేవడిగా కొత్త పెళ్లి కూతురు పరిస్థితి
పెళ్లి చేసుకున్న నిఖిత అతనితో సుఖంగా కాపురం చేసి ఉంటే అతని భార్య గా అధికారికంగానే ఆ బంగారాన్ని, ధనాన్ని ఉపయోగించుకునేది. కానీ అలా కాకుండా దొంగతనం చేసి భర్తకు చెప్పకుండా అక్కడినుంచి పారిపోయి పోలీసుల ముందు లొంగిపోయిన నిఖిత పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బంగారం,డబ్బు దొంగతనం చేసి దర్జాగా బ్రతుకుదాం అనుకున్న ఆమె ప్రయత్నం ఫలించకపోగా, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమె భర్త సచిన్ తివారీ తో కలిసి జీవించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది.