షాకింగ్: గత ఆర్ధిక సంవత్సరంలో పెట్రోల్ ధరలు 78సార్లు డీజిల్ ధరలు 76సార్లు పెరిగాయి
దేశంలో నిత్యావసరాల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగడం పై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూసి ఆయన షాకయ్యారు .
Recommended Video

పెట్రోల్ ధరలు 78 సార్లు డీజిల్ ధర 76 సార్లు పెరిగాయని కేంద్రం సమాధానం
2021- 2022 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోల్ ధరలు 78 సార్లు డీజిల్ ధర 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాజ్యసభలో తన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంగా గణాంకాలను ఉదహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఇంధనం ధరల పెరుగుదల ఇతర వస్తువుల ధరలపై ప్రభావం
2016 మరియు 2022 మధ్య ఇంధనంపై విధించిన ఎక్సైజ్ సుంకం ద్వారా ప్రభుత్వం రూ.16 లక్షల కోట్లు సంపాదించిందని ఆయన అన్నారు. ఇంధనం పెరుగుదల ప్రతి ఇతర వస్తువు ధరలపై ప్రభావాన్ని చూపుతుందని చద్దా తెలిపారు. ద్రవ్యోల్బణం అతి తీవ్ర సమస్యగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణంపై పార్లమెంటులో ప్రస్తావించాలని కూడా కేంద్రం కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుంటున్నది అని దీనికి కేంద్ర మంత్రి సమాధానమే నిదర్శనమని ఆయన విమర్శించారు.

కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సామాన్యులను లూటీ చేస్తుందన్న ఎంపీ
2019-20తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.5 లక్షల కోట్ల ఆదాయం పెరిగిందని ఆయన చెప్పారు. అద్భుతమైన వసూళ్లు ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించే బదులు ఇంధన ధరలను పెంచడం ద్వారా ప్రభుత్వం పేదలు మరియు సామాన్య ప్రజలపై కనికరం లేకుండా భారం వేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సామాన్యులను లూటీ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్న స్పష్టమైన అంగీకారం అని ఆయన అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని రాజ్యసభ ఎంపీ ఆరోపించారు. ఒక్క సంవత్సర కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తీరు సామాన్య ప్రజలపై ఎంతటి పెనుభారం వేసిందో కేంద్రం చెప్పిన గణాంకాలే సాక్ష్యం అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications