రేప్: కేజ్రీవాల్ కూతురుపై వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: షాకింగ్! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూతురు పైన ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్ దీనిపై సీరియస్ అయింది. అతనికి నోటీసులు ఇవ్వనుంది.
నిర్భయ కేసులో బాల నేరస్తుడిని విడుదల చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని గ్యారీ అనే వ్యక్తి తెలిపాడు. అయితే, నిర్భయ నిందితుడిని (మైనర్) వదిలేయడం తప్పని చెప్పడం సరైనదే కావొచ్చు. కానీ కేజ్రీవాల్ కూతురు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం.
గ్యారీ అనే వ్యక్తి.. 'ఎవరైనా 17, 18 ఏళ్ల యువకుడు కేజ్రీవాల్ కుమార్తెపై అత్యాచారం చేస్తే రూ.1 లక్ష, సరికొత్త బైక్ బహుమతిగా ఇస్తా'నని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. దీనిని చూసిన ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది.
ఈ ట్వీట్ను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీడబ్ల్యూ సభ్యురాలు ప్రొమిల్లా గుప్తా వెల్లడించారు. కాగా, తన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారాన్ని తెలుసుకున్న గ్యారీ దానిని తొలగించాడు.