బీహార్ సిఎంపై బూటువిసిరిన వ్యక్తి: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీపై ఓ వ్యక్తి బూటు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాట్నాలో నిర్వహించిన జనతా దర్బార్లో పాల్గొనడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కుల రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రిపై బూటు విసిరిన వ్యక్తి మండిపడ్డాడు. ఇది ఇలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ యూత్ విభాగానికి అధ్యక్షుడు అయిన అభిషేక్ బెనర్జీని ఆదివారం చండీపూర్లో జరిగిన ర్యాలీలో ఓ యువకుడు చెంప మీద కొట్టాడు.
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
బీహార్ సిఎం జితన్ రామ్ మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు లెవీ తీసుకోవడాన్ని తాను మద్దతిస్తున్నానని జితన్ అన్నారు. కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు అక్రమంగా సంపాదిస్తున్నప్పుడు... వారి నుంచి మావోయిస్టులు లెవీ డిమాండ్ చేయడం తప్పేమి కాదని చెప్పారు.
కాంట్రెక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని తానొకసారి ముగ్గురు మావోయిస్టులను ప్రశ్నించానని మాంఝీ తెలిపారు. తప్పుడు లెక్కలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్న కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి తాము లెవీ డిమాండ్ చేయడంలో తప్పులేదని మావోయిస్టులు తనకు చెప్పారని మాంఝీ తెలిపారు.