శ్రద్ధ హత్య కేసు: తెల్లవారుజామునే బ్యాగుతో అఫ్తాబ్, బాడీ పార్ట్సేనా? (వీడియో)
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. హత్య చేసిన అనంతరం శ్రద్ద శరీర భాగాలను పలు ప్రాంతాల్లో విసిరేసినట్లు అఫ్తాబ్ చెప్పడంతో పోలీసులు వాటి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. పలు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్నింటి కోసం అఫ్తాబ్ను తీసుకెళ్లి గాలిస్తున్నారు.
#WATCH | Shraddha murder case: CCTV visuals of Aftab carrying bag at a street outside his house surface from October 18 pic.twitter.com/S2JJUippEr
— ANI (@ANI) November 19, 2022
అయితే, తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అందులో అక్టోబర్ 18న తెల్లవారుజామున అఫ్తాబ్ చేతిలో బ్యాగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. భుజానికి ఓ బ్యాగు, చేతిలో మరో కార్టన్ ప్యాకేజీతో అఫ్తాబ్ చీకట్లో ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉంది. అది మెహ్రౌలీ అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గమని తెలుస్తోంది. అయితే, మే 18న శ్రద్ధా హత్యకు గురైంది.
ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కొన్ని వారాలపాటు ఫ్రిడ్జ్లో పెట్టాడు అఫ్తాబ్. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. తాజాగా, ఈ వీడియో బయటికి రావడంతో ఇలానే బ్యాగులో పట్టుకుని ఆమె మృతదేహం ముక్కలను పలు ప్రాంతాలకు తరలించాడా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా చేయడం గమనార్హం. శ్రద్ధ మొబైల్ ఫోన్ కూడా ఇప్పటి వరకు లభించలేదు.
కాగా, అఫ్తాబ్ ఫ్లాట్ నుంచి పోలీసులు ఓ పదునైన కట్టింగ్ పరికరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే ఆయుధంతో శ్రద్దను ముక్కలు చేసివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కూడా అఫ్తాబ్ను విచారిస్తున్నారు పోలీసులు. అయితే, అప్తాబ్ మాత్రం విచారణకు సరిగా సహకరించకపోవడం పోలీసులకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే కోర్టు నుంచి నార్కో టెస్ట్ కు పోలీసులు అనుమతి తెచ్చుకున్నారు. వచ్చేవారం నిందితుడు అఫ్తాబ్ కు నార్కో టెస్ట్ చేయనున్నారు.