వ్యభిచారంపై నోరు విప్పిన హీరోయిన్ శ్వేతా బసు
ముంబై: జాతీయ అవార్డు విజేత, కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు వ్యభిచారం ఆరోపణలపై రెస్క్యూ హోం నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలి సారి నోరు విప్పింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లు రెండు నెలల క్రితం ఆరోపణలు ఎదుర్కుని రెస్క్యూ హోంలో గడిపిన ఆమె ముంబై చేరుకుంది. డిఎన్ఎతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడింది.
తాను ఎప్పుడు కూడా వ్యభిచారంలోకి కాలు పెట్టలేదని, చలనచిత్ర పరిశ్రమలో తనకు పని లేకపోవడం అనేది ఎప్పుడూ లేదని ఆమె చెప్పింది. తనపై వ్యభిచారం ఆరోపణలు మోపిన వార్తాకథనంపై ఆమె మండిపడింది. రెస్క్యూ హోంకు వెళ్లేటప్పుడు తాను ఏ విధమైన ప్రకటన కూడా చేయలేదని స్పష్టం చేసింది.
రెస్క్యూ హోంకు వెళ్లిన తర్వాత తనకు బయటి ప్రపంచంతో ఏ విధమైన సంబంధాలు లేవని, తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయలేదని, అందువల్ల మీడియాతో మాట్లాడే ప్రసక్తే ఉండదని ఆమె చెపపింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తాను ప్రకటన చేసినట్లుగా వచ్చిన వార్తాకథనంపై తప్ప తనకు ఎవరి మీదా ఫిర్యాదులు లేవని ఆమె చెప్పింది.
ఆ ప్రకటనను అంతటా పంపిణీ చేశారని, దాని గురించి కూడా తనకు తెలియదని, రెండు నెలల పాటు తనకు వార్తాపత్రికలతో గానీ వెబ్సైట్తో గానీ మాట్లాడే అవకాశమే రాలేదని, తనకు ఆ విషయం ఇప్పడే తెలిసిందని శ్వేతబసు చెప్పింది.
తాను వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లు వార్త వచ్చిన తర్వాత తాను చెప్పే విషయం కోసం మీడియా వేచి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. తన వివరణ ఇచ్చే వరకు మీడియా ఆగాల్సి ఉండిందని చెప్పింది. తన కుటుంబ నేపథ్యం గురించి తెలుసా అని ప్రశ్నించింది. శ్వేతబసు సాధారణ జీవితంలోకి అడుగు పెట్టింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంపై డాక్యుమెంటరీని ఆమె ప్రస్తుతం పూర్తి చేస్తోంది.
అక్రమ మానవ రవాణాలో పట్టుబడిన పిల్లలతో కలిసి రెస్క్యూ హోంలో ఉన్నానని, అక్కడ పిల్లలకు టీచర్లా సేవలు అందించానని, పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించానని శ్వేతాబసు చెప్పింది. రెండు నెలల కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నానని తెలిపింది.
తాను అవార్డు ఫంక్షన్ కోసమే హోటల్కు వెళ్లానని తెలిపింది. తాను బాధితురాలిగా మారానని ఆవేదన వ్యక్తం చేసింది. తాను కష్టంలో ఉన్నప్పుటు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరు తన వెన్నంటి ఉన్నారని తెలిపారు.