సీఎం ఓటుకు రూ.500 నుంచి రూ. 1,000 ఇస్తారు, ఆయనే చెప్పారు, రాళ్లతో దాడి, మాజీ సీఎం!
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మే నెలలో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఒక్క ఓటుకు రూ. 500, రూ.1,000 ఇవ్వడానికి సిద్దం అయ్యారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి ఆరోపించారు. ఓటర్లను డబ్బుతో కొనడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగినబుద్ది చెబుతారని మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి హెచ్చరించారు. డబ్బుతో గెలుస్తామని సిద్దరామయ్య చెప్పారని కుమారస్వామి ఆరోపించారు.
సీఎం నోట డబ్బు మాట
శాసన సభ ఎన్నికల్లో తాము డబ్బు ప్రభావంతోనే గెలుస్తామని స్వయంగా సీఎం సిద్దరామయ్య చెప్పారని కర్ణాటక జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి ఆరోపించారు. ఇలా డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామాని చెప్పిన సిద్దరామయ్యలాంటి సీఎంను తన జీవితంలో చూడలేదని కుమారస్వామి అన్నారు.
సీఎం చిక్కితే అంతే
సీఎం డబ్బుతో గెలుస్తామని చెప్పడంతో స్కూల్ పిల్లలు సైతం రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన సిద్దరామయ్య ఫ్లెక్సీలు, బ్యానర్ ల మీద రాళ్లతో దాడి చేస్తున్నారని హెచ్ డి. కుమారస్వామి అన్నారు. ఇక సీఎం సిద్దరామయ్య స్వయంగా వారి చేతికి చిక్కితే ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదని హెచ్ డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు.
సీఎంను ఓడిస్తాం
చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్ డి. కుమారస్వామి చాలెంజ్ చేశారు. చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతారని హెచ్ డి. కుమారస్వామి జోస్యం చెప్పారు.
సీఎం మారిపోతారు
చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య పోటీ చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని, ఎన్ఆర్ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని ఆయన ఆలోచిస్తున్నారని, అలా జరిగినా ఆశ్చర్యపడాల్సి అవసరం లేదని హెచ్. డి. కుమారస్వామి అన్నారు.
రెండు చోట్ల పోటీ
రామనగర తనకు కర్మభూమి వంటిదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి. కుమారస్వామి అన్నారు. శాసన సభ ఎన్నికల్లో తాను రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తానని హెచ్ డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు. అయితే ఎందుకు రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్నాను అనే విషయం మాత్రం హెచ్ డి. కుమారస్వామి మీడియాకు వివరించలేదు.