యడ్యూరప్ప మూడు రోజులు ముఖ్యమంత్రి: నేటితో అంతం: మాజీ సీఎం సిద్దూ ఎద్దేవ, మెజారిటీ!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశం ప్రారంభం అయ్యింది. కర్ణాటకలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అంటూ కన్నడిగులతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇలాంటి సందర్బంలో అసెంబ్లీలో కుర్చున్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత సిద్దరామయ్య మూడు రోజుల ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అధికారం నేటితో అంతం అవుతోంది అంటూ ఎద్దేవ చేశారు.
అసెంబ్లీ నుంచి ట్వీట్
అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయిన వెంటనే సిద్దరామయ్య మూడురోజుల ముఖ్యమంత్రి యడ్యూరప్ప అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. మెజారిటీ లేకుండానే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారని, కర్ణాటక ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కుర్చీలో కుర్చున్నారని సిద్దరామయ్య ఆరోపించారు.
సాయంత్రం ఇంటికి
శనివారం సాయంత్రం కర్ణాటక ప్రజల అభిప్రాయాలు, ఆశయాలకు విజయం లభిస్తుందని మాజీ సీఎం సిద్దరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం యడ్యూరప్ప అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేక ఇంటికి వెలుతారని సిద్దరామయ్య జోస్యం చెప్పారు.
బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మెజారిటీ లేదని, బీజేపీలోని ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడుతారనే భయంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు.
బీజేపీ నాయకుల ధీమా
బీజేపీకి మద్దతు తెలపడానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలోని 16 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని బీజేపీ నాయకులు బహిరంగంగానే అంటున్నారు. అయితే మా ఎమ్మెల్యేలు ఎవ్వరూ బీజేపీకి మద్దతు ఇవ్వరని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.