సిక్కిం మహిళపై రేప్: ఎయిమ్స్ వైద్యుడి అరెస్టు, అతను హైదరాబాదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక సిక్కిం మహిళ(25)పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎయిమ్స్ న్యూరాలజీ విభాగ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని హైదరాబాద్కు చెందిన మెహర్ తేజ్(27)గా గుర్తించారు. అతడికి మరో రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బాధిత మహిళకు బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నలుగురు వ్యక్తులు ఈ నెల 20న ఢిల్లీకి తీసుకొచ్చారు.
కానీ, ఆమెను వ్యభిచారం చేయాలని వారు బలవంతం పెట్టారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమెను ఒక ఆటోలో మెహర్ తేజ్ ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు. రాత్రి తనపై మెహర్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెహర్తోపాటు మహిళను అక్రమంగా ఢిల్లీకి తీసుకొచ్చి, ఇలా వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేసిన నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
సెక్స్ వర్కర్ల కోసం తాను బ్రోకర్లను సంప్రదిస్తుంటానని, అందులో భాగంగానే ఈ మహిళను తన వద్దకు తీసుకొచ్చినందుకు రాత్రి ఒక వ్యక్తికి తాను రూ.9 వేలు ఇచ్చానని మెహర్ తేజ్ పోలీసులకు చెప్పాడు. ఆమె అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు మెహర్ చెప్పాడని పోలీసులు అంటున్నారు. కానీ, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ మేజిస్ర్టేట్ ముందు బాధిత మహిళ చెప్పింది.
దాంతో ఆమెకు వైద్య పరీక్షలు చేయించి, మెహర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ఉదంతంలో అత్యాచారం, అక్రమ రవాణ, ఇతర నేరాలపై కేసు నమోదు చేశారు. రెండు నెలల నుంచి ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు నిందితులు చెప్పడంతో ఢిల్లీకి అక్రమంగా మహిళలను తీసుకొచ్చి ఇలా వ్యభిచారంలోకి దింపుతున్నారేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు ఆర్మీ అధికారి భార్య కావడం విశేషం. ఆమె భర్త రాజస్థాన్లోని గూర్ఖా రెజిమెంట్లో పనిచేస్తున్నాడు. అరెస్టయిన వారిలో భార్యాభర్తలు కూడా ఉన్నారు. వీరిని మనుషులను రవాణా చేస్తున్న కేసులో అరెస్టు చేశారు. అరెస్టయినవారిని సుమన్ (37), ఆమె భర్త దీపక్ అలియాస్ సాగర్ (40), కమల్ (31)లుగా గుర్తించారు. గౌతం నగర్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఇంటికి బాధితురాలిని చేరవేసిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.