బీప్ సాంగ్ చిక్కులు: మళ్లీ శింబు పిటిషన్
చెన్నై : బీప్ సాంగ్ కేసుకు సంబంధించి తమిళ నటుడు శింబు మద్రాసు హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. బీప్సాంగ్ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశానని, ఆ పిటీషన్ను హైకోర్టు విచారణ జరిపి, పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిందని ఆయన ఈ పిటీషన్లో చెప్పారు.
కోయంబత్తూరులో ఒక కేసు, చెన్నైలో ఒక కేసు చొప్పున మొత్తం రెండు కేసులు తనపై నమోదై ఉన్నాయని, బీప్సాంగ్ పాడాననేది ఒకే ఒక ఆరోపణ అని, కానీ ఒకే ఆరోపణపై రెండు చోట్ల రెండు కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని ఆ పిటిషన్లో అన్నారు.
ఈ వ్యవహారంలో ఏదైనా ఒక చోట మాత్రమే పోలీసుల ఎదుట తాను విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. రెండు చోట్ల హాజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారని, పోలీసుల విచారణకు స్టే ఇవ్వాలని ఆ పిటీషన్లో కోరారు. ఈ పిటీషన్ న్యాయమూర్తి సుబ్బయ్య ఎదుట ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు రానుంది.