భారత్లో కరోనా కాటుకు 50 వేలమందికి పైగా బలి: విచ్చలవిడిగా: వైరస్ ఎపిక్ సెంటర్గా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. రోజురోజుకూ మహా భయంకరంగా విజృంభిస్తోంది. లక్షలాదిమందిని ఆసుపత్రుల పాలు చేసిన కరోనా వైరస్ వేలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా కాటుకు దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 50 వేల మందికి పైగా బలి అయ్యారు. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వెయ్యి వరకు రోజువారీ మరణాలు నమోదు అవుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో తగ్గుదల అనేదే కనిపించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రోజువారీ కరోనా కేసుల నమోదవుతోన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటోంది.

57 వేలకు పైగా కొత్త కేసులు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 57,982 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 941 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 26,47,664కు చేరుకుంది. మరణాల సంఖ్య 50 వేలను దాటుకుంది. ఇప్పటిదాకా 50,961 మంది మరణించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,76,900కి చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 19,19,843గా నమోదైంది.

సగటున రోజూ 60 వేల కేసులు..
భారత్లో ప్రతిరోజూ సగటున 60 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్లతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా అధికమని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో భారత్.. కరోనా వైరస్కు ఎపిక్ సెంటర్గా మారిందటూ జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కేసుల సంఖ్య భారత్లో ఇదివరకెప్పుడూ లేనంతగా పెరుగుతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

అమెరికా, బ్రెజిల్లతో పోల్చుకుంటే..
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుతం భారత్.. ప్రపంచ దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో, అమెరికా, మలి స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి. కిందటి వారం అమెరికాలో నమోదవుతోన్న రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ఆశించిన స్థాయిలో అమెరికాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. బ్రెజిల్లో కూడా అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. బ్రెజిల్ గ్రాఫ్ సమాంతరంగా ఉంటోంది. అదే సమయంలో భారత్లో మాత్రం విచ్చలవిడిగా కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది.

మూడు కోట్లను దాటిన కరోనా పరీక్షలు
ఇదిలావుండగా.. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు మూడు కోట్లను దాటేశాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సారథ్యంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రోజువారీ శాంపిళ్ల టెస్టుల్లో ఐసీఎంఆర్ మరోసారి రికార్డును నమోదు చేసింది. ఆదివారం ఒక్కరోజే 7,31,697 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటిదాకా 3,00,41,400 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.












Click it and Unblock the Notifications