కరోనా ప్రళయం: దేశంలో నయా రికార్డ్: ఒక్కరోజులో 70 వేలకు చేరువగా: ప్రతి నిమిషానికీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. రోజురోజుకూ మహా భయంకరంగా విస్తరిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో వేగం మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. భారత్లో మాత్రం దాని ప్రభావం ఏ మాత్రం తగ్గట్లేదు. పైగా గంటగంటకూ బలపడుతోంది. పాజిటివ్ కేసుల అంకెలు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. కరోనా కాటుకు దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 53 వేల మందికి పైగా బలి అయ్యారు. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వెయ్యి వరకు రోజువారీ మరణాలు నమోదు అవుతున్నాయి.

కొత్తగా 70 వేలకు చేరువగా..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 69,652 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 977 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 28,36,926కు చేరుకుంది. మరణాల సంఖ్య 53 వేలను దాటుకుంది. ఇప్పటిదాకా 53,866 మంది మరణించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,86,395కు చేరుకుంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 20,96,665గా నమోదైంది.

ఒక్కరోజులో ఈ స్థాయిలో..
దేశంలో ఒక్కరోజు వ్యవధిలో 69 వేలకు పైగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ స్థాయి కేసులు ప్రపంచంలో మరెక్కడా నమోదు కాకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికాలోనూ 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదు. 57 లక్షలకు పైగా కరోనా కేసులు అమెరికాలో రికార్డు అయ్యాయి. ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల్లో రెండోస్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్ను చేరుకోవడానికి భారత్కు ఇక ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇదే వేగం కొనసాగితే రెండు వారాల్లోపే బ్రెజిల్ను వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

సగటున రోజూ 60 వేల కేసులు..
భారత్లో ప్రతిరోజూ సగటున 60 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్లతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా అధికమని పేర్కొంది. ఇది ఆందోళన కలిగించే అంశమని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కేసుల సంఖ్య భారత్లో ఇదివరకెప్పుడూ లేనంతగా పెరుగుతోందని పేర్కొన్నారు.

ఒక్కరోజులో 9 లక్షలను దాటిన టెస్టులు
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు మూడు కోట్లను దాటేశాయి. ఒక్కరోజు వ్యవధిలో రికార్డు స్థాయిలో తొమ్మిది లక్షలకు పైగా టెస్టులను నిర్వహించడం కూడా ఓ రికార్డే. బుధవారం ఒక్కరోజులో 9,18,470 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం టెస్టింగుల సంఖ్య 3,26,61,252కు చేరుకున్నట్లు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలూ టాప్ ప్లేస్లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications