కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, హిందూ జాగరణ వేదిక నేత అరెస్టు, రివాల్వర్!
బెంగళూరు: లంకేష్ పత్రిక ఎడిటర్ హత్య కేసులో ఎస్ఐటీ అధికారులు కీలకసమాచారం సేకరించారు. హిందూ జాగరణ వేదిక నాయకుడు కేటీ. నవీన్ అలియాస్ హోట్టే మంజు (పొట్ట మంజు) అనే వ్యక్తి అక్రమంగా రివాల్వర్, ఐదు బుల్లెట్లు తరలిస్తున్న సమయంలో అతన్ని బెంగళూరులోని ఉప్పరపేట పోలీసులు అరెస్టు చేశారు.
Recommended Video
మెజస్టిక్ లో!
కర్ణాటకలోని మండ్య జిల్లా కదలూరుకు చెందిన నవీన్ హిందూ జాగరణ వేదిక కీలకనేత. బెంగళూరులోని మెజస్టిక్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నవీన్ ను ఉప్పరపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ దగ్గర పాయింట్ 32 రివాల్వర్, ఐదు బుల్లెట్లు ఉన్న విషయం గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
లైసెన్స్ లేదు
నవీన్ దగ్గర స్వాధీనం చేసుకున్న రివాల్వర్ కు లైసెన్స్ లేదని పోలీసులు తెలుసుకున్నారు. నవీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మంగళూరులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళూరు నుంచి ముగ్గురిని బెంగళూరు తీసుకువస్తున్నారు.
హంతకులతో సంబంధం !
లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ ను హత్య చేసిన వారు ఎవరు అనే విషయం నవీన్ కు తెలుసని ఎస్ఐటీ అధికారులు అంటున్నారు. అయితే గౌరీ లంకేష్ హత్యలో ఇతను ప్రత్యక్షంగా పాల్గొనలేదని ఎస్ఐటీ అధికారులు చెబుతున్నారు.
టచ్ లో లేరు
గౌరీ లంకేష్ ను హత్య చెయ్యడానికి హంతకులు బెంగళూరు వచ్చి వెళ్లడానికి నవీన్ సహకరించాడని ఎస్ఐటీ అధికారులు చెబుతున్నారు. అయితే గౌరీ లంకేష్ ను హత్య చేసిన తరువాత హంతకులు నవీన్ తో ఒక్కసారి కూడా మాట్లాడలేదని, ఇతనికి పూర్తిగా టచ్ లో లేరని, విచారణ చేస్తున్నామని ఎస్ఐటీ అధికారులు తెలిపారు.