బీజేపీకి షాక్, గాలి జనార్దన్ రెడ్డిని తెరమీదకు తెచ్చిన కాంగ్రెస్, సీబీఐ చేతులు ఎత్తేసింది, సిట్ !
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కర్ణాటకలోని అక్రమ మైనింగ్ వ్యవహారం మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి బీజేపీ నాయకులకు గట్టి షాక్ ఇవ్వాలని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అయ్యింది.
ఐదు సంవత్సరాలు అధికారం కొల్పోయిన బీజేపీ నాయకులు 2018 శాసన సభ ఎన్నికల్లో 150 స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందు కోసం బీజేపీ నాయకులు నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్రను గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

కర్ణాటకలోని 225 శాసన సభ నియోజక వర్గాల్లో 75 రోజుల పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప నేతృత్వంలో యాత్ర కొనసాగిస్తున్నారు. బీజేపీ నాయకులకు సరైన సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బేలేకేరీ షిప్ యార్డు నుంచి అక్రమంగా రూ. వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం విదేశాలకు ఎగుమతి చేసిన కేసు వ్యవహారం ఇప్పుడు తెరమీదకు తీసుకు వచ్చారు.
బేలేకేరి ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు ఇటీవల కేసు మూసి వేశారు. అదే కేసును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా మైనింగ్ కింగ్ గాలి జానర్దన్ రెడ్డి ఉన్నారు.
బీజేపీని ఇరుకున పెట్టాలంటే గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం మళ్లీ తెరమీదకు తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ మైనింగ్, అక్రమంగా విదేశాలకు ఇనుప ఖనిజం ఎగుమతి చేసిన వ్యహారంలో బీజేపీ నాయకులకు సంబంధం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరులు, శాసన సభ్యులు సతీష్, సురేష్ బాబు, నాగేంద్ర, ఆనంద్ సింగ్ తదితరులు సైతం బేలేకేరి ఇనుస ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో ముద్దాయిలుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications