మోడీ సరే మీ తండ్రి, తాత మాటేమిటి, కూర్చొని చూడు!: రాహుల్కు వెంకయ్య
వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం కౌంటర్ ఇచ్చారు. దీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన కుటుంబం నుండి వచ్చిన వారు ఇప్పుడు మోడీ సూటు గురించి విమర్శలు చేస్తున్నారని, మీ తండ్రి, తాత సూట్లు ధరించలేదా అని ప్రశ్నించారు.
మోడీ సూటు ధరిస్తే నానా యాగీ ఎందుకో చెప్పాలన్నారు. ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నిర్వహించడం లేదన్నారు. ఆరు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ చేయలేకపోయిన పనులను ఎన్డీయే చేస్తోందన్నారు. మోడీ సర్కారును ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
పదకొండు నెలల శిశువు పరుగెత్తలేడని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం తక్కువ వ్యవధిలో పరుగు ప్రారంభించిందన్నారు. అది కాంగ్రెస్ పార్టీ గమనించాలని సూచించారు. చప్పుడు చేయకుండా కూర్చొని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూడాలన్నారు.
రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణం: అమిత్ షా
దేశాన్ని ఆరు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకొని ఉంటే నేడు రైతులు ఈ దుస్థితిలో ఉండేవారు కాదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విమర్శించారు. ఓ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారని, అయితే రైతులకోసం కాంగ్రెస్ ఏమి చేసిందనేది ఆ పాదయాత్రల్లో కాని బస్సు యాత్రల్లో కాని చెప్పడం లేదని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ సంక్షేమం కోసం ఏమి చేస్తోందో ప్రజలకు తెలుసన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందన్నారు. అయితే గణాంకాలు ఎప్పుడూ తప్పు చెప్పవని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ పురోగమిస్తోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు ఒక ఇంచు భూమి కూడా ఇవ్వబోదన్నారు.