హత్య కేసు నిందితుడిని ఆధార్ పట్టించింది
ముంబై: భార్యను హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఆధార్ పట్టించింది. ఆరేళ్ళ క్రితం భార్యను హత్య చేసి పోలీసుల నుండి తప్పించుకొన్న
సతీష్ మహిపాల్ వాల్మీకిని ఆధార్ కార్డు పట్టించింది. ఆధార్కార్డ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్కి చెందిన సతీశ్ మహిపాల్ వాల్మీకి(37) నైగమ్లో నివాసం ఉంటున్నాడు. 2012లో తన భార్యను అతి దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారేశాడు. కేసు నమోదు చేసిన భద్రకాళి స్టేషన్ పోలీసులు సతీశ్ వాల్మీకిని అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే భార్యను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. సతీశ్ వాల్మీకిని అదే ఏడాది సెప్టెంబర్లో వైద్యపరీక్షల నిమిత్తం నాసిక్ సివిల్ హాస్పిటల్కు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనం దిగి 60 అడుగుల ఎత్తు నుంచి గోదావరి నదిలో దూకి తప్పించుకున్నాడు.
నిందితుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు పంపించారు. నిందితుడి ఆధార్ కార్డ్ లభ్యమవడంతో ఫోన్ నెంబర్ను పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసిన పోలీసులు సోమవారం యూపీలోని నిందితుడి స్వగ్రామం బరానాకు చేరుకున్నారు. వాల్మీకిని అదుపులోకి తీసుకుంటుండగా స్థానికులు పోలీసులపై దాడికి దిగారు.
అతికష్టమ్మీద నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ముంబైకి తీసుకొచ్చారు. సాయంత్రం నాసిక్ సెంట్రల్ రోడ్డు జైలుకు వాల్మీకిని తరలించారు. ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేయడంతో కేసు సులువుగా ఛేదించగలిగామని పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications