స్మృతీ ఇరానీ.. ఇచ్చిన హామీ ప్రకారం అమేథీలో నివాస స్థలం కొనుగోలు..
లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నెరవేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇలాఖా అమేథీలో స్మృతి ఇరానీ పాగా వేసిన సంగతి తెలిసిందే. అమేథీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని స్థానికులకు పూర్తిగా అందుబాటులో ఉంటానని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేశారు. రాహుల్ను ఓడిస్తానని సవాల్గా తీసుకుని స్మృతి ఇరానీ మొదటిసారి అమేథీ నుంచి లోక్సభకు పోటీ చేశారు.
హోరాహోరి ప్రచారం చేసి చివరకు రాహుల్గాంధీని ఓడించారు. స్మృతి ఇరానీ పోటీతో భయపడి కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ చేశారని రాజకీయాల్లో చర్చ జరిగింది. రాహుల్ అమేథీలో ఓడిపోయి.. వయనాడ్లో గెలిచాడు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీ స్థానికంగా ఉండడని, ఢిల్లీలో తిష్టవేసి నియోజకవర్గాన్నిపట్టించుకోవట్లేదని చెప్పి స్థానిక ఓటర్లకు గాలం వేశారు. తాను గెలిస్తే ఇక్కడే ఇంటి నిర్మాణం చేసుకుని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో స్మృతి ఇరానీ ప్రకటించారు.
స్థానికులు స్మృతి ఇరానీకి భారీగా ఓట్లు వేశారు. ఇచ్చిన హామీ మేరకు స్మృతి ఇరానీ ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టారు. సోమవారం ఇంటికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. త్వరలోనే ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తానని.. దీనికి నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ఎంపీగా విజయం సాధించినప్పటీ నుంచి ఇక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు నిర్మించుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు.