భర్తతో కలిసి పూజ, ఆశేష జనవాహిని మధ్య రోడ్ షో : అట్టహాసంగా స్మృతి ఇరానీ నామినేషన్
అమేథీ : కాంగ్రెస్ కంచుకోట అమేథీలో పాగా వేయాలని భావిస్తోన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రచారంలోనే కాదు నామినేషన్ వేసే ముందు కూడా భారీ ర్యాలీ తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి భారీ ర్యాలీ తీశారు. అంతకుముందు తన భర్త జుబిన్తో కలిసి పూజలు కూడా నిర్వహించారు స్మృతి ఇరానీ. ర్యాలీ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు స్మృతి ఇరానీ.
ప్రజలతో మమేకం
గత ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి స్మృతి ఇరానీ బరిలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేతిలో ఓడిపోయారు. కానీ గత ఐదేళ్ల నుంచి అమేథీ ప్రజలతో కలిసిపోతున్నారు. వివిధ కేంద్ర పథకాలను అమేథీకి తీసుకొచ్చి అక్కడి ప్రజల మదిని దోచుకునేందుకు ప్రయత్నించారు. గతనెలలో రైఫిల్ ఫ్యాక్టరీ ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం ఇందుకు సజీవ సాక్ష్యం. ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచిన రాహుల్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు స్మృతి ఇరానీ. ఈ సారి రాహుల్ .. కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంతో తన విమర్శలకు మరింత పదును పెట్టారు స్మృతి ఇరానీ.

అక్కడి నుంచి ఎందుకు ?
అమెథీలో తాను గెలవలేననే అభద్రతాభావంతో రాహుల్ .. వాయనాడ్ వెళ్లిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. స్మృతి ఇరానీ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, కానీ వారి కల నేరవేరదని మండిపడ్డారు స్మృతి ఇరానీ. పనిలోపనిగా రాబర్ట్ వాద్రా లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి రాబర్ట్ వస్తే .. ఇక్కడి రైతుల నుంచి నిరసన ఎదురయ్యేదని గుర్తుచేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన వాద్రా ... అవినీతికి పరాకష్ట అని మండిపడ్డారు స్మృతి ఇరానీ.












Click it and Unblock the Notifications