ఎన్నికల టైంలో నోట్ల కట్టల పాములు కామన్....మరి ఈవీఎంలో ఇవేం పాములు..
కన్నూరు: దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేరళ రాష్ట్రంలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఒకే సారి పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అయితే అక్కడికి ఓటు వేసేందుకు అనుకోని అతిథి ఒకరు వచ్చారు. అతిథి ఓటు వేసేందుకు వచ్చారా అంటే అదీ కాదు..ఇంతకీ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గెస్ట్ ఎవరు..? టాక్ ఆఫ్ ది టౌన్గా ఎందుకు నిలిచారు..?

మయ్యికండై పోలింగ్ కేంద్రంలో అనుకోని అతిథి ప్రత్యక్షం
దేశవ్యాప్తంగా మూడవ విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కేరళలో కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ ఎన్నికలు. ఇక ఇక్కడి నుంచి బీజేపీ ఖాతా తెరవాలని భావిస్తోంది. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకున్నారు ఓటర్లు. కన్నూర్ లోక్సభ నియోజకర్గంలో కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మయ్యికండకై పోలింగ్ కేంద్రంలో అనుకోని ఒక అతిథి దర్శనమిచ్చారు. వచ్చిన అతిథి క్యూలైన్లో నిల్చోలేదు.. నేరుగా ఈవీఎంల దగ్గరకే వెళ్లారు.

వీవీ ప్యాట్లో దర్శనమిచ్చిన పాము
ఇంతకీ పోలింగ్ కేంద్రంలో ప్రత్యక్షమైన ఆ అతిథి ఎవరో తెలుసా...? ఓ పాము. అవును మీరు చదివింది నిజమే. ఈవీఎంలకు అటాచ్ చేసి ఉన్న వీవీప్యాట్లో ఈ పాము దర్శనమిచ్చింది. సాధారణంగా ఈవీఎంపై బటన్ నొక్కగానే వీవీప్యాట్లో స్లిప్పు బయటకు కనిపిస్తుంది. కానీ మయ్యికండకై పోలింగ్ కేంద్రంలో మాత్రం వీవీప్యాట్లో పాము కనిపించింది.

ఉలిక్కి పడ్డ సిబ్బంది ఓటర్లు..స్తంభించిన పోలింగ్
వీవీప్యాట్లో పాము కనిపించగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఎన్నికల సిబ్బంది, ఓటర్లు. వెంటనే భద్రతా సిబ్బందికి తెలుపగా... వారు వచ్చి ఈ పామును జాగ్రత్తగా వీవీప్యాట్లో నుంచి బయటకు తీశారు. పామును తీసుకెళ్లి ఊరిచివర ఉన్న చెట్లలో వదిలేశారు. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము వీవీప్యాట్ మెషీన్లో ఉండటంతో కొంతసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత అంతా సర్దుకుంది. కన్నూరు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ పీకే శ్రీమతి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి కే సురేంద్రన్, బీజేపీ నుంచి సీకే పద్మనాభన్లు బరిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications